సెలబ్రిటీలు, స్టార్లు తమ వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది సమాజానికి అంతో ఇంతో మంచి చేసేదే అయినా ఎందుకొచ్చిన గొడవలెమ్మని మౌనంగా ఉంటారు. పరిస్థితులు అవే మారతాయని సర్దిచెప్పుకుని నయవంచన చేసుకునే వాళ్లకు కొదవ లేదు. కానీ అక్షయ్ కుమార్ ఈ కోవలోకి రాను అంటున్నారు. చుట్టూ ఉన్న సమస్యలు, ప్రమాదాల గురించి గొంతు విప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాములుగా అయితే టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ లాంటివి ఇమేజ్ ఉన్న వాళ్ళు చేయడానికి ఆలోచిస్తారు. కానీ అక్షయ్ అలా కాదు. ఇక రియల్ లైఫ్ విషయానికి వద్దాం.
ఇటీవలే సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ చెప్పిన ఒక ఉదాహరణ ఆలోచింపజేసేలాగే కాదు తల్లితండ్రులకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. అక్షయ్ కుమార్ కూతురు కొన్ని నెలల క్రితం ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతూ ఉండగా అవతల యాప్ లో తనతో ప్లే చేస్తున్న ఒక యువకుడు ఈమెను నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని అడిగాడు. ఇందులో తప్పేం ఉంది లెమ్మని తను నిజం చెప్పింది. దీంతో అతగాడు వెంటనే దుస్తులు లేకుండా ఫోటోలు పంపమని మెసేజ్ చేశాడు. దీంతో షాక్ తిన్న ఆ పాప వెంటనే అమ్మానాన్నకు ఈ విషయాన్ని చెప్పేసి వెంటనే గేమ్ ని డిలీట్ చేసింది.
సరే తనకు అవగాహన ఉంది కాబట్టి బయట పడింది. కానీ అమాయకంగా ఉండే ఆడపిల్లలు ఇలాంటి ఆగంతకులని నమ్మి అన్నంత పని చేస్తే జీవితాలు నాశనమవుతాయి, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇదంతా వివరించిన అక్షయ్ కుమార్ తొమ్మిది నుంచి పదో తరగతి వరకు పిల్లల కోసం సైబర్ క్రైమ్ పీరియడ్ ఉండాలని కోరుతున్నాడు. టెక్నాలజీ ప్రపంచంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో అందులో వివరించాలని చెప్పాడు. ఐడియా బాగుంది. నిజంగా అమలు చేస్తే ఇప్పటి జనరేషన్ కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఆ దిశగా అడుగులు వేసేదెవరో చూడాలి. మహారాష్ట్రలోనే కాదు అన్ని చోట్లా ఇది జరగాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates