పైరసీ ప్రాణం తీసే వరకు వదలకూడదు

నిన్న హైదరాబాద్ పోలీసులు అతి పెద్ద పైరసీ నెట్ వర్క్ ని బ్రేక్ చేయడం, ఆరుకు పైగా నిందితులను అరెస్ట్ చేయడం టాలీవుడ్ ని కుదిపేసింది. పోలీస్ కమీషనర్ ఆనంద్ అధర్వంలో జరిగిన సమావేశంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, రామ్ తో పాటు ఇతర అగ్ర నిర్మాతలు పాల్గొని అయన చెప్పిన విషయాలు షాకవుతూ విన్నారు. రిలీజ్ రోజే హెచ్డి ప్రింట్లు బయటికి రావడం, వాటి ద్వారా కోట్లలో వసూళ్లను పోగొట్టుకోవడం, దీని వెనుక మాఫియా ఎలా పనిచేస్తోందనే వివరాలు ఆధారాలతో సహా వీడియోలో చూపించడంతో  నివ్వెరపోయి చూశారు. ఇన్నాళ్లు తమకు తెలిసింది చాలా తక్కువంటూ ఆశ్చర్యపోయారు.

తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫాంట్ రాజు అనే వ్యక్తి దీనికి మూలమని కనిపెట్టిన పోలీసులు అతనికి ఏజెంట్ గా పని చేస్తున్న కిరణ్ ని పట్టుకోవడంతో ఈ డొంకంతా కదిలింది. ఇతను వనస్థలిపురం వాసి. పైరసీ ప్రింట్లను తయారు చేసి వాటిని బెట్టింగ్ యాప్స్ కి అమ్మడం ద్వారా కోట్ల రూపాయల బిజినెస్ ని తెరతీసిన ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా నూటా యాభైకి పైగా సినిమాలను కేవలం రెండు మూడేళ్ళ వ్యవధిలో పైరసీ చేసింది. ఒక్క టాలీవుడ్ కే మూడు వేల కోట్లకు పైగా నష్టం వచ్చేలా చేసింది. డిజిటల్ సర్వర్లను సైతం హ్యాక్ చేసిన వీళ్ళ టెక్నాలజీ తలలు పండిన పోలీస్ పెద్దలను సైతం మాట రాకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు.

ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇప్పుడు వేసిన తొలిపాదం ఉక్కుపాదంలా మారాలి. ఏ  పైరసీ వెబ్ సైట్స్ అయితే పోలీసులు పేర్కొన్నారో వాటిలో కొన్ని ఇప్పటికీ పని చేస్తూ ఉండటం గమనార్హం. ముందు వీటిని బ్లాక్ చేయాలి. సైబర్ క్రైమ్ రంగంలోకి దిగి వేరొకరు పైరసీ గురించి ఆలోచించాలంటేనే భయపడేలా కఠిన చర్యలు, శిక్షలకు పూనుకోవాలి. లేదంటే వీడియో క్యాసెట్ల కాలం నుంచి హెచ్డి ప్రింట్ల జమానా దాకా ఇదిలాగే కొనసాగుతూ ఉంటుంది. యువకులే ఈ నేరంలో పాలు పంచుకోవడం విషాదం. భవిష్యత్తుని కాలదన్నుకొని ఈజీ మనీ కోసం ఇలా అడ్డదారులు పట్టి సినిమా పరిశ్రమను నిలువునా ముంచేయడం దారుణం.