ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం దక్కినందుకు ఎగ్జైటవడం.. తీరా ఆ సినిమాలో తన పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని ఫీలవడం.. చాలా మంది ఆర్టిస్టుల విషయంలో ఇలా జరుగుతుంటుంది. ‘సామజవరగమన’తో తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న తమిళ నటి రెబా మోనికా జాన్ కూడా ఇప్పుడు ఇలాగే ఫీలవుతోంది.
ఆమెను అసంతృప్తికి గురి చేసిన సినిమా.. కూలీ. ఇందులో శ్రుతి హాసన్ ఇద్దరు చెల్లెల్లలో ఒకరిగా కనిపించింది రెబా మోనికా. ఐతే ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం దక్కలేదు. పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన రెబా మోనికాను సైడ్ క్యారెక్టర్కు పరిమితం చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ విషయంలో రెబా కూడా తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. ఇక ఇంటర్వ్యూలో దాన్ని బయట పెట్టేసింది.
‘కూలీ’లో తన పాత్రకు సంబంధించి తాను నిరాశకు గురై, అప్సెట్ అయిన మాట వాస్తవమని.. తన పాత్రకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉండాల్సిందని.. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా ఏదీ జరగదని రెబా వ్యాఖ్యానించింది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి నటించాలనే కోరిక నెరవేరినందుకు మాత్రం తాను రుణపడి ఉంటానని ఆమె పేర్కొంది. ఐతే రెబా పాత్ర విషయంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ను నిందించడానికి ఏమీ లేదంటూ తన ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
ఈ సినిమాలో రజినీతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఇవ్వమని తనే లోకేష్ను అడిగినట్లు ప్రి రిలీజ్ ఇంటర్వ్యూల్లో రెబా పేర్కొంది. తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని లోకేష్ చెప్పినా సరే.. ఆమే ముందుకొచ్చి ఆ పాత్రను తీసుకుందని.. ఇప్పుడు తన రోల్ విషయంలో అసంతృప్తికి గురయ్యానంటూ లోకేష్ను పరోక్షంగా నిందించడం ఎంత వరకు సమంజసం అని లోకేష్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా ‘కూలీ’లో తన పాత్ర విషయంలో ఆమిర్ ఖాన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ లేదని ఆమిర్ టీం ఖండించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates