90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె అప్పటి టాప్ స్టార్లందరితోనూ సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. కెరీర్లో బిజీగా ఉండగానే ఆమె విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. వీరికి ఓ అమ్మాయి పుట్టింది. తన పేరు.. నైనిక. తమిళ బ్లాక్బస్టర్ మూవీ ‘తెరి’లో ఆ పాప కీలక పాత్ర పోషించింది.
ఐతే మూడేళ్ల కిందట మీనా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఐతే భర్త చనిపోయిన కొన్ని రోజులకే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత కూడా అవి కొనసాగడం తనకు తీవ్ర మనోవేదన కలిగించినట్లు మీనా చెప్పారు. జీ తెలుగు కోసం సీనియర్ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోల ో పాల్గొన్న మీనా.. ఈ విషయమై మాట్లాడారు.
‘‘నేను నటిగా బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. ఐతే దురదృష్టవశాత్తూ నా భర్త 2022లో చనిపోయారు. ఆయన చనిపోయిన వారానికే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో రాశారు. వాళ్లకు కుటుంబాలు ఉండవా, ఇలా రాస్తున్నారేంటి అని చాలా బాధ పడ్డాను. ఆ తర్వాత ఏ నటుడు విడాకులు తీసుకున్నా.. నాతో పెళ్లి అని రాసేవారు. అలాంటి వార్తలు చూసి అసహ్యం పుట్టింది’’ అని మీనా ఆవేదనగా మాట్లాడారు.
తన కెరీర్ ఆరంభంలో నిర్మాతల కష్టం చూసి చాలా తక్కువ పారితోషకాలకు సినిమాలు చేశానని.. కానీ ఆ సినిమాలు పెద్ద హిట్టయినా తనను పట్టించుకునేవారు కాదని మీనా చెప్పింది. తన పాప పుట్టిన రెండేళ్లకు మోహన్ లాల్ మలయాళ సినిమా ‘దృశ్యం’ కోసం అడిగారని.. పాప కోసం తాను చేయలేనని చెప్పానని.. కానీ తనను దృష్టిలో ఉంచుకునే ఆ క్యారెక్టర్ రాశామని.. ఇంకెవరితోనూ ఆ సినిమా చేయమని చెప్పడంతో అందులో నటించాల్సి వచ్చిందని.. సెకండ్ ఇన్నింగ్స్లో తనకు అది పెద్ద బ్రేక్ ఇచ్చిందని మీనా చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates