అసలు త్రివిక్రమ్‍ అవసరం వుందా?

అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ చిత్రానికి మాటలు రాసి, స్క్రిప్టు పరంగా కాసిని మార్పులు చేసేందుకు గాను పది కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని బలంగా వినిపిస్తోంది. పవన్‍ కళ్యాణ్‍ సినిమాకు త్రివిక్రమ్‍ మాటలు రాస్తే కొంచెం క్రేజ్‍ వస్తుంది కానీ మలయాళం ఒరిజినల్‍ చూసిన వారికి దీనికి త్రివిక్రమ్‍ అవసరం దేనికనిపిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రం కథ, పాత్రలు ప్రధానంగా సాగిపోతుంది. దానికంటూ ప్రత్యేక సంభాషణలు అవసరం లేదు.

మలయాళంలో వున్న డైలాగులను తర్జుమా చేసుకుని రాసుకుంటే సరిపోతుంది. దానికి త్రివిక్రమ్‍ ప్రాస కానీ, ఆయనకున్న పరిజ్ఞానం కానీ అవసరం లేదు. త్రివిక్రమ్‍ లాంటి రైటర్‍ను పెట్టుకుంటే సంభాషణల పరంగా తన ముద్ర చాటుకోవాలని లేనిపోని డైలాగులు రాసే ప్రమాదం కూడా లేకపోలేదు. అసలు ఈ చిత్రంలో అయ్యప్ప నాయర్‍ పాత్ర చేయడానికి పవన్‍ కళ్యాణ్‍ ఇమేజే సరిపోదని సాక్షాత్తూ పవన్‍ అభిమానులే చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్‍ డైలాగులంటూ హంగామా చేస్తుండడంతో ఈ రీమేక్‍ రాంగ్‍ ట్రాక్‍లో వెళుతోందనే కామెంట్లు పడుతున్నాయి. పవన్‍కి జోడీగా సాయి పల్లవి నటిస్తుందనే రూమర్‍ కూడా ఒరిజినల్‍లో లేని హంగులన్నీ పెడుతున్నారనే ఫీలింగ్‍ మరింత పెంచింది.