రాజా సాబ్ మీద నమ్మకం రెట్టింపయ్యింది

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న రాజా సాబ్ కు సంబంధించి ఫ్యాన్స్ రెండు విషయాల్లో టెన్షన్ పడుతున్నారు. మొదటిది దర్శకుడు మారుతీ ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడాని. దానికి టీజర్ లో కొంత క్లారిటీ రావడంతో హమ్మయ్యాని ఊపిరి పీల్చుకున్నారు. రెండోది విఎఫెక్స్ ఎలా ఉంటుందోనని. అయితే తాజాగా మిరాయ్ అవుట్ ఫుట్ చూశాక నిశ్చింతగా ఉన్నారు. కారణం రాజా సాబ్ నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే మిరాయ్ ప్రొడ్యూసర్ కావడం. వంద కోట్ల లోపే అంత క్వాలిటీ చూపించినప్పుడు ఇక నాలుగు వందల కోట్లంటే ఏ స్థాయి అవుట్ ఫుట్ ఆశించవచ్చో వేరే చెప్పాలా.

ముందు నుంచి నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజా సాబ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నారు. మిరాయ్ కన్నా చాలా ఎక్కువ షాట్స్ రాజా సాబ్ లో ఉండబోతున్నాయి. హారర్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ టెర్రిఫిక్ అనిపించే సన్నివేశాలకు బోలెడు స్కోప్ ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పెద్ద ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన సన్నివేశాలు, బంగళాలో జరిగే సంఘటనలు వీటన్నింటికి ఆషామాషీ విఎఫెక్స్ సరిపోదు. తెరమీద చూస్తున్నప్పుడు స్పెల్ బౌండ్ అవ్వాలి. ముఖ్యంగా ఉత్తరాది ఆడియన్స్ షాక్ అవ్వాలి. మారుతీ, నిర్మాణ సంస్థ ఇద్దరి టార్గెట్ అదే. అప్పుడే రికార్డులు సాధ్యం.

మిరాయ్ కు పని చేసిన మెయిన్ టెక్నీషియన్స్ రాజా సాబ్ లో కూడా భాగమయ్యారట. తమన్ సంగీతం గురించి ఫ్యాన్స్ లో ప్రత్యేక హైప్ నెలకొంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అయిపోవడంతో అదనంగా సమయం దొరికింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ మీద మరింత ఫోకస్ పెట్టొచ్చు. అఖండ 2 రీ రికార్డింగ్ పూర్తి చేసి రాజా సాబ్ కోసం తమన్ ప్రత్యేకంగా సమయం కేటాయించబోతున్నట్టు సమాచారం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన రాజా సాబ్ లో సంజయ్ దత్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటుందట. ప్రభాస్ కు తండ్రిగా, తాతగా రెండు షేడ్స్ ఉంటాయని ఇన్ సైడ్ లీక్.