VFX మీద విస్తృత చర్చ

ప్యాన్ ఇండియా సినిమాల విషయంలో దర్శక నిర్మాతల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న కంప్లయింట్ విఎఫ్ఎక్స్. విశ్వంభర ఏకంగా ఏడాది వాయిదా పడినా, కన్నప్పను రెండుమూడు సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చినా, హరిహర వీరమల్లు రిలీజ్ డేట్లతో దోబూచులాడినా అన్నింటికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీనే. పోనీ ఇంతా చేసి ఏమైనా పాజిటివ్ రిజల్ట్ వచ్చాయా అంటే అదీ లేదు. ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. ఆదిపురుష్ ఏకంగా నేషనల్ లెవెల్ లో ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ చర్చలోకి వస్తోంది. కారణం మిరాయ్.

పరిమితంగా పెట్టుకున్న బడ్జెట్ లోనే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన క్వాలిటీకి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని ఏఐ షాట్లు ఉన్నప్పటికీ బీజీఎమ్, సీన్స్ లో డెప్త్ వల్ల అది మరీ హైలైట్ కాకపోవడం ఉన్న కాసిన్ని మైనస్సులను తగ్గించేసింది. సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్వీట్లు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదు. దీని వెనుక ఏదైనా ప్రమోషనల్ స్ట్రాటజీ ఉన్నా లేకపోయినా థియేటర్లలో ఆడియన్స్ సాక్ష్యం రూపంలో కనిపిస్తున్నారు కాబట్టి వాస్తవాలను దాచి ఉంచలేం. ఇప్పుడు చాలా ప్యాన్ ఇండియా మూవీస్ విఎఫెక్స్ ఆధారంగా సెట్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి పునఃసమీక్షించుకోవాలి.

అలాని మిరాయ్ లో నెవర్ బిఫోర్ కంటెంట్ ఉందని చెప్పడం లేదు. ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడలేదని అనడం లేదు. కాకపోతే జనాలు కన్విన్స్ అయ్యేలా ఎమోషన్, యాక్షన్, డివోషన్ ని ప్రాపర్ గా బాలన్స్ చేసినప్పుడు లోపాలు ఉన్నా అవన్నీ పక్కకు వెళ్లిపోతాయి. మిరాయ్ విషయంలో జరుగుతోంది అదే. తేజ సజ్జ మీద ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఇక టయర్ 1 హీరోలు ఎంత శ్రద్ధ ఉండాలో వేరే చెప్పాలా. పబ్లిక్ కి నిర్మాణ సంస్థ ఎంత ఖర్చు పెట్టింది అనవసరం. వాళ్లకు కావాల్సింది టికెట్ డబ్బులకు న్యాయం జరగడం. అందుకే కార్తికేయ 2, మిరాయ్ లాంటివి విలువైన పాఠాలుగా నిలుస్తున్నాయి.