మిరాయ్.. టాలీవుడ్ వైపు ఇతర భాషల ప్రేక్షకులు మరోసారి చూసేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్న సినిమా. ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు తేజ సజ్జ. ఆ తర్వాత సరైన ప్లానింగ్తో ‘మిరాయ్’ లాంటి మరో సూపర్ హీరో అడ్వెంచరస్ ఫిలిం చేశాడు. దీని టీజర్, ట్రైలర్ వేరే భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి.
ఆయా భాషల్లో పేరున్న నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో.. పాజిటివ్ టాక్ వస్తే ‘హనుమాన్’ స్థాయిలోనే ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిలో ఈ సినిమా పడడానికి కారణం.. టీజర్, ట్రైలర్లలో చూపించిన భారీ విజువల్స్, ఎఫెక్ట్స్. ముఖ్యంగా ఒక భారీ పక్షి అవతారంతో హీరో అడ్వెంచర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయనే సంకేతాలను ప్రోమోలు ఇచ్చాయి.
ఈ పక్షి వెనుక పెద్ద కథే ఉందని యూనిట్ వర్గాల సమాచారం. సినిమాలో రాముడి పాత్ర కీలకంగా ఉంటుందని టీం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. రాముడికి సాయం చేసిన జటాయు అనే పక్షి గురించి అందరికీ తెలుసు. దాని సోదరుడైన సంపతి అనే పక్షి రాజును ‘మిరాయ్’లో చూపించబోతున్నారు. జటాయు, సంపతి సూర్యుడి పుత్రులట. తన సోదరుడైన జటాయును కాపాడే క్రమంలో సంపతి రెక్కలు కాలిపోతాయి.
సంపతి ఎగరలేని స్థితిలో ఉన్నప్పటికీ అది లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను వానర సైన్యానికి చూపించి రామాయణంలో తన వంతు పాత్రను పోషించిందట. ఆ పక్షి రాజు పాత్రను ‘మిరాయ్’లో చూపించబోెతున్నారు. కథా గమనంలో కీలక మలుపుకి ఈ పక్షి కారణమవుతుందట. దీని సాయంతోనే హీరో తన లక్ష్యానికి చేరువ అవుతాడట. భారీగా ఖర్చు చేసి వీఎఫెక్స్ సాయంతో ఈ పక్షిని రూపొందించింది చిత్రం. దీంతో ముడిపడ్డ సన్నివేశాలు సినిమాలో హైలైట్గా ఉంటాయని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates