రెండేళ్ల తర్వాత అనుష్క సినిమా వస్తోందంటే ఆడియన్స్ లో ప్రత్యేక అంచనాలు నెలకొంటాయి. అరుంధతి నుంచి బాహుబలి దాకా తనకంటూ స్వంత ఫాలోయింగ్ సంపాదించుకున్న స్వీటీ టాలీవుడ్ లో విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ మార్కెట్ ఏర్పరుచుకుందనే రేంజ్ లో ఒకప్పుడు కథనాలు వచ్చాయి. ఇదంతా సైజ్ జీరో రిలీజ్ కు ముందు కథ. ఆ మూవీ కోసం బరువు తగ్గించుకుని మళ్ళీ పెరిగి ఫిజికల్ గా చాలా ఇబ్బంది పడిన అనుష్క అప్పటి నుంచి బయట కనిపించడం తగ్గించేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ ప్రమోషన్లకు కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ఘాటీ ఫలితం మొదటి రోజే తేలిపోయింది. ఆదివారం సెలవు రోజే అయినా కనీస స్థాయిలో ఆక్యుపెన్సీలు లేకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. కథా కథనాలు కనీస స్థాయిలో ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు గంజాయి బ్యాక్ డ్రాప్ ని పెట్టుకుని రొటీన్ కంటెంట్ ని దర్శకుడు క్రిష్ చూపించిన విధానం ఆడియన్స్ ని ఎంత మాత్రం మెప్పించలేకపోయింది. సిచువేషన్ ఎలా ఉందంటే ఘాటీ కోసం అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు పెద్దగా ఆలోచన చేయకుండా లిటిల్ హార్ట్స్ కు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. చాలా బిసి సెంటర్లలో ఇలా చేయక తప్పలేదని ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాట.
డిజాస్టర్లు అందరికీ వస్తాయి కానీ ఒక ఇమేజ్ ఉన్న స్టార్ కి ఓపెనింగ్స్ కూడా దక్కలేదంటే తప్పు ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. వీడియోలో కనిపించకుండా కేవలం ఆడియో రూపంలో అనుష్క చేసిన ప్రమోషన్లు బెడిసి కొట్టాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సహకారం అందించినా అవి జనాలను చేరలేదు. మనిషి ఎదురుగా కనిపించి సినిమా చూడమని వేడుకుంటేనే ప్రేక్షకులు కరగలేని ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది నా గొంతు విని టికెట్లు కోనేయండి అంటే ఎలా పనవుతుంది. అనుష్క నెక్స్ట్ రిలీజ్ కథనర్ పబ్లిసిటీకైనా స్వీటీ డైరెక్ట్ దర్శనం జరుగుతుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates