శివ కార్తికేయన్ మార్కెట్ ఎక్కువ ఊహిస్తున్నారా

సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న మదరాశికి తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే అమరన్ బ్లాక్ బస్టర్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఏపీ తెలంగాణ మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తం ఆశిస్తున్నారని డిస్ట్రిబ్యూషన్ వర్గాల గుసగుస. సుమారు 14 కోట్లను డిమాండ్ చేస్తున్నారట. అయితే అంత పెద్ద మొత్తం శివ కార్తికేయన్ మీద వర్కౌట్ కాదని భావించిన బయ్యర్లు దానికి నో చెబుతున్నారని టాక్. ప్రస్తుతం బేరాలు జరుగుతున్నాయని సమాచారం. అమరన్ బాగా ఆడిన మాట వాస్తవమే కానీ ఇక్కడ హీరో ఇమేజ్ కన్నా ఎక్కువ పని చేసింది కంటెంట్ లో ఉన్న ఎమోషన్. అంతే తప్ప ఏదో స్టార్ మేజిక్ మీద ఆడిన సినిమా కాదది.

మదరాశికి అతి పెద్ద ప్రతికూలాంశం దర్శకుడు మురుగదాస్. ఈ మధ్య పూర్తిగా ట్రాక్ తప్పేసిన ఈ ఒకప్పటి కల్ట్ డైరెక్టర్ ఆ మధ్య సల్మాన్ ఖాన్ కు సికందర్ రూపంలో పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడీ మదరాశి  ప్రమోషన్లలో కూడా పొంతన లేని స్టేట్ మెంట్లతో ఊరికే ట్రిగ్గర్ అవ్వడమే పనిగా పెట్టుకున్నారు. ట్రైలర్ వచ్చాక కొంచెం నమ్మకమైతే వచ్చింది కానీ అమాంతం ఓపెనింగ్స్ పెంచే స్థాయిలో అయితే కాదు. డాన్, డాక్టర్ తెలుగులో సక్సెస్ ఫుల్ వెంచర్లు. ఒరిజినల్ వెర్షన్ బాగా ఆడిన మహావీరుడు ఇక్కడ జస్ట్ యావరేజ్ అయ్యింది. సో శివ కార్తికేయన్ కు ఇక్కడ సాలిడ్ మార్కెట్ ఇంకా ఏర్పడలేదు.

ఇంకో నాలుగుగైదు రోజుల్లో మదరాశి ప్రమోషన్లు హైదరాబాద్ లో మొదలుపెట్టబోతున్నారు. ఒక ఈవెంట్ కూడా జరగనుంది. అయినా టైటిల్ లోనే నేటివిటీ మిస్సవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం, విద్యుత్ జమాల్ విలనిజం, హీరోయిన్ రుక్మిణి వసంత్ లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి. కానీ ఆడియన్స్ లో సరిపడా ఎగ్జైట్ మెంట్ ని రేకెత్తించడంలో మదరాశి తడబడుతోంది. అసలే పోటీలో అనుష్క ఘాటీ ఉంది. పుష్ప రేంజ్ లో దర్శకుడు క్రిష్ దీన్ని తీర్చిదిద్దారని టాక్ ఉంది. ఇది కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మదరాశికు మన దగ్గర ఇబ్బందులు తప్పవు. చూడాలి మరి.