టఫ్ టుమారో : బాక్సాఫీస్ వీధుల్లో స్టార్ల యుద్ధం

రేపు అతి పెద్ద క్లాష్ కోసం థియేటర్లు సిద్ధమయ్యాయి. గత రెండు నెలలుగా సరైన బ్లాక్ బస్టర్ లేక అలో లక్ష్మణా అంటూ దిక్కులు చూస్తున్న ఎగ్జిబిటర్లకు ఊపిరి అందించేందుకు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, రజనీకాంత్, నాగార్జున రెడీ అయ్యారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రస్తుతానికి కూలి పై చేయి స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షోలో రెండింటి మధ్య డబుల్ మార్జిన్ వ్యత్యాసం దాస్తే దాగేది కాదు. అయితే లోకేష్ కనగరాజ్ బ్రాండ్, పూజా హెగ్డే సాంగ్, అనిరుద్ మ్యూజిక్ లాంటి అట్రాక్షన్లు వార్ 2లో లేకపోవడంతో భారం మొత్తం తారక్ మీదే పడింది. బెనిఫిట్ షోలు కేవలం ఆ పేరు మీదే ఫుల్ అవుతున్నాయి .

ఇప్పటికి ట్రెండ్ ఎలా ఉన్నా రేపు మార్నింగ్ షోలు అయ్యాకే ఎవరు మొదటి విజేత అవుతారనేది తేలుతుంది. కూలి ఇప్పటికే యుఎస్ లో రెండు మిలియన్లు దాటేయగా వార్ 2 మిలియన్ వైపు వెళ్తోంది కానీ నడక నెమ్మదిగా ఉంది. నార్త్ లో చూసుకుంటే హృతిక్, తారక్ కాంబినేషన్ పని చేస్తోంది. క్రమంగా బుకింగ్స్ పెరుగుతున్న వైనం సేల్స్ లో కనిపిస్తోంది. హిందీ ఫ్లేవర్ ఎక్కువగా అనిపించడం వల్ల ఏపీ తెలంగాణ బిసి సెంటర్స్ లో కొంచెం మూమెంట్ తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రీమియర్ షో అయ్యాక బయటికొచ్చే ఫాన్స్ తీసుకెళ్లే టాక్ దాని అసలు స్టేటస్ ని డిసైడ్ చేయబోతోంది.

మొత్తం స్టేట్ వైడ్ థియేటర్లన్నీ కిక్కిరిసిపోవడం ఖాయం. ఎల్లుండి ఇండిపెండెన్స్ డే ఉన్న నేపథ్యంలో రేపటి షోలకు దేనికీ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. రెండింటికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు చూడబోయేది మాములు పండగ కాదు. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉన్నప్పటికీ టాక్ బాగున్నప్పుడు ప్రేక్షకులు హైక్ ని అంగీకరిస్తారనేది గతంలో ఋజువయ్యింది కాబట్టి ఇప్పుడు కూడా బయ్యర్లు అదే ధీమాతో ఉన్నారు. వంద కోట్ల గ్రాస్ లక్ష్యంతో కూలీ, నూటా ఎనభై కోట్లకు పైగా గ్రాస్ టార్గెట్ తో వార్ 2 బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ క్లాష్ కురిపించే కాసుల వర్షం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.