తమిళనాట మహేష్ బాబు సందడి

మహేష్ బాబుకు తమిళ మార్కెట‌్‌ను కొల్లగొట్టాలని ఎప్పట్నుంచో ఆశ. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేశాడు. మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్‌తో ‘స్పైడర్’ సినిమా సెట్ చేసుకుని‌ తెలుగుతో పాటు తమిళంలోనూ దాన్ని చేశాడు. దాని కంటే ముందు కూడా కొన్ని సినిమాలను కొంచెం పెదద్ స్థాయిలోనే తమిళంలో రిలీజ్ చేయించాడు. కానీ ‘స్పైడర్’ సహా ఏ చిత్రమూ అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మహేష్ తమిళ మార్కెట్ గురించి ఆలోచించడం మానేశాడు.

ఐతే అతను పట్టించుకోకున్నప్పటికీ.. తన కొత్త చిత్రాన్ని తమిళంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. సంక్రాంతికి విడుదలై మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ‘ఇవనక్కు సరియాన ఆలిల్లై’ పేరుతో తమిళంలోకి అనువాదం చేశారు. లాక్ డౌన్ విరామం తర్వాత తమిళనాట ఇటీవలే థియేటర్లు తెరుచుకోగా.. ఒక స్ట్రెయిట్ మూవీ స్థాయిలో ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తుండటం విశేషం.

తెలుగులో మాదిరే తమిళంలో కూడా కొత్త చిత్రాలను ఇప్పట్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. కానీ ఇటీవలే పున:ప్రారంభం అయిన థియేటర్లను ఓ మోస్తరుగా అయినా నడిపించాలంటే కొత్త సినిమాలు కావాల్సిందే. ఇదే మహేష్ సినిమాను డబ్ చేసిన నిర్మాతలకు వరమైంది. మామూలుగా అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం కష్టం. కానీ ఇప్పుడు తెరిచిన ప్రతి థియేటర్లో ఈ సినిమాను నడిపించే అవకాశం దొరికింది.

అక్కడి స్టార్ హీరోల సినిమాల స్థాయిలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, విజయశాంతి, రష్మిక.. వీళ్లంతా తమిళ ప్రేక్షకులకు పరిచయమే. ఐతే తమిళనాట సైతం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే మూడ్‌లో అయితే లేరు. థియేటర్లు పున:ప్రారంభం అయినా నామమాత్రంగానే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహేష్ సినిమాకు ఏమాత్రం వసూళ్లు వస్తాయో చూడాలి.