రవితేజ మల్టీప్లెక్స్.. ఊపేస్తోంది

తెలంగాణలో ప్రస్తుతం అతి పెద్ద థియేట్రికల్ ఛైన్స్‌లో ఏషియన్ మూవీస్ ఒకటి. పీవీఆర్ లాంటి పెద్ద ప్లేయర్‌కు దీటుగా ఈ సంస్థ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తూ దూసుకెళ్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో అసోసియేట్ అవుతూ.. మల్టీప్లెక్స్‌లను నిర్మించడం ద్వారా వాటికి జనాల్లో క్రేజ్ తీసుకొస్తోంది. మహేష్ బాబుతో కలిసి గచ్చిబౌలిలో నిర్మించిన ఏఏంబీ ఎంత పెద్ద హిట్టో హైదరాబాద్ జనాలకు తెలుసు. అలాగే అమీర్ పేటలో అల్లు అర్జున్‌తో కలిసి ‘ఏఏఏ’ మల్టీప్లెక్స్ నిర్మించగా.. దానికీ మంచి స్పందన వస్తోంది. మహబూబ్ నగర్‌లో విజయ్ దేవరకొండ భాగస్వామ్యంలోనూ ఒక మల్టీప్లెక్స్ కట్టారు.

తాజాగా మాస్ రాజా రవితేజతో కలిసి ఏషియన్ వాళ్లు నిర్మించిన ‘ఏఆర్‌టీ’ సినిమాస్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌-విజయవాడ హైవే మార్గంలోని వనస్థలిపురంలో కట్టిన మాల్‌లో ఈ మల్టీప్లెక్స్ ఉంది. హైదరాబాద్‌లో ఈస్ట్ సైడ్ నిర్మితమైన తొలి మల్టీప్లెక్స్ ఇదే కావడం విశేషం. ఇక్కడ ఎక్కువగా మిడిల్ క్లాసే ఉంటారు. అందుకే ఇప్పటిదాకా మల్టీప్లెక్స్ నిర్మాణం కాలేదు. కానీ ఇక్కడ ఏషియన్ సునీల్, రవితేజ కలిసి ఆరు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇది ఇన్‌స్టంట్ హిట్టవడం.. జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సినిమాలు చూస్తుండడం విశేషం.

ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్‌కు ‘ఎపిక్’ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో నిర్మితమైన తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం. ఐమాక్స్‌కు పోటీగా క్యూబ్ సంస్థ అభివృద్ధి చేసిన బిగ్ స్క్రీన్ టెక్నాలజీ ‘ఎపిక్’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతోంది. పెద్ద స్క్రీన్లో అదిరిపోయే విజువల్ క్వాలిటీ, అధునాతన సౌండ్ సిస్టమ్‌తో ఉన్న ఈ థియేటర్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎగ్జైట్ అవుతున్నారు. ఆ అనుభవం గురించి సోషల్ మీడియాలో గొప్పగా స్పందిస్తున్నారు.

జులై 31న ‘కింగ్డమ్’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ మొదలైంది. అప్పట్నుంచి ఎపిక్ స్క్రీన్లో దాదాపు ప్రతి షో ఫుల్ అవుతోంది. సిటీలో ఎక్కడెక్కడి నుంచో సినీ అభిమానులు ఈ స్క్రీన్లో సినిమ ాచూసి ఆ అనుభూతి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ఈ మల్టీప్లెక్స్‌లో స్క్రీన్లన్నీ బాగున్నాయనే టాక్ వస్తోంది. రవితేజ సినిమాల్లోని పాపులర్ డైలాగులను గుర్తు చేస్తూ.. ‘కిక్కు ప్రాప్తిరస్తు’ అంటూ ఈ మల్టీప్లెక్స్‌లోకి వెల్కమ్ చెప్పడం.. వాష్ రూమ్స్‌లో ‘అయ్‌బాబోయ్ ఇంత అందంగా ఉన్నానేంటి’ క్యాప్షన్ పెట్టడం.. టికెట్ కౌంటర్ దగ్గర.. ‘లచ్చిందేవి’ అనే రాయడం.. లాంటివి మాస్ రాజా ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.