విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో సీనియర్ హీరో దివంగత విజయ్ కాంత్ ని ఏఐలో సృష్టించి క్యామియో చేయించడం ఆడియన్స్ కి చిన్నపాటి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది కొత్తేమి కాదు. వెంకటేష్ కలిసుందాం రాలోనూ ఇలాంటి ప్రయోగం చేశారు. కానీ ఇప్పుడు ఈ సాంకేతికత నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతోంది. 2013లో ధనుష్ రంఝానా రిలీజయ్యింది. ప్రశంసలు, కలెక్షన్లు రెండూ వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ కు బాలీవుడ్ లో మొదటి బ్రేక్ ఇచ్చిన మూవీ ఇదే. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం, మంచి కంటెంట్ వెరసి సూపర్ హిట్ అందించాయి.
ఇదే తమిళ్ లో అంబికాపతిగా డబ్ చేస్తే అక్కడా విజయం సాధించింది. కట్ చేస్తే తాజాగా ఈ రంఝానాని రీ రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ క్లైమాక్స్ లో ధనుష్ పాత్ర చనిపోతుంది. హాస్పిటల్ లో చివరి శ్వాస తీసుకోగా ఇంకో జన్మలో మళ్ళీ చిన్న పిల్లాడై పుట్టినట్టు చూపించి శుభం కార్డు వేస్తారు. కానీ ఇప్పుడీ కొత్త ప్రింట్ లో ధనుష్ కళ్ళు తెరిచి బ్రతికేశాడు. ఏఐ వాడి ఏకంగా క్లైమాక్స్ ని మార్చేశారు. ఊహించని ఈ సర్ప్రైజ్ కి ధనుష్ అభిమానులు థియేటర్ లో షాక్ తిన్నారు. ఇలాంటి ట్విస్టు ఎప్పుడూ చూడలేదంటూ ఈలలు, చప్పట్లతో సినిమా హాళ్లను హోరెత్తించారు.
ఇప్పుడీ టెక్నిక్ కనక వర్కౌట్ అయితే భవిష్యత్తులో ఇలా చనిపోయిన పాత్రలను మళ్ళీ బ్రతికిస్తారేమో చూడాలి. తెలుగులో ఇలాంటి యాంటీ క్లైమాక్స్ లున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఇది మంచిది కాదనేది మూవీ లవర్స్ అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోవడానికి కారణం ప్రాణ త్యాగాలే అయ్యుంటాయి. కానీ ఇప్పుడు మార్చి చూపిస్తే కొత్త జనరేషన్ కు వేరే అర్థం వస్తుంది. ఉదాహరణకు దేవదాసు, ప్రేమాభిషేకంలో చనిపోయిన అక్కినేని నాగేశ్వరరావుని ఇప్పుడు మార్చి బ్రతికిస్తే ఏమవుతుంది. వాటి విలువ తగ్గుతుంది. అందుకే ఇలాంటి ప్రయోగాలు రంఝానాతో ఆపేస్తే బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates