కింగ్‌డమ్ విలన్… ఒక ఇడ్లీ కొట్టు

నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్‌డమ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అత్యంత ఆకర్షణీయమైన ప్రసంగం ఎవరిది అంటే.. మరో మాట లేకుండా వెంకిటేష్‌ది అని చెప్పేయొచ్చు. ఈ మలయాళ యువ నటుడు ‘కింగ్‌డమ్’లో మురుగన్‌ అనే మెయిన్ విలన్ పాత్ర చేయడం విశేషం. ఇలా ఒక యంగ్ ఆర్టిస్టును, అది కూడా వేరే భాషకు చెందిన వ్యక్తిని ఇలాంటి క్రేజీ మూవీలో విలన్ పాత్రకు తీసుకోవడం ఆశ్చర్యమే. ఐతే ఇప్పటికే మలయాళంలో చేసిన తక్కువ సినిమాల్లోనే తనదైన ముద్ర వేసిన వెంకిటేష్.. ‘కింగ్‌డమ్’లోనూ అదరగొట్టాడని ప్రోమోలను బట్టి అర్థమవుతోంది. 

హీరో విజయ్ దేవరకొండ.. వెంకిటేష్ గురించి ప్రత్యేకంగా ఒక పోస్టు కూడా పెట్టి ప్రశంసలు కురిపించాడు. ఇక నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్‌తో తెలుగు వాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు వెంకిటేష్. దాదాపు పది నిమిషాల పాటు అతను చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ.. ఉర్రూతలూగించాడు. విజయ్ సహా అందరూ తన ప్రసంగానికి ఆశ్చర్యపోయారు. వీలైనంత మేర తెలుగులో, చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ.. తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్న తీరు భలేగా అనిపించింది.

ఈ స్పీచ్‌తో నిన్న సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవడంతో వెంకిటేష్ గురించి మన వాళ్లు ఆరాతీయడం మొదలుపెట్టారు. తన సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఐతే సినిమాలను మించి తన వ్యక్తిగత జీవితంలో ఒక ఆసక్తికర విషయం ఉంది. అతను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. సినిమాల్లో అవకాశాలు అందుకోవడానికి ముందు అతను త్రివేండ్రమ్‌లో హోటల్ నడపడం విశేషం. అలా అని అదేమీ పెద్ద స్థాయిది కాదు. రోడ్ సైడ్ చిన్న ఇడ్లీ కొట్టు. కానీ అక్కడ ఎప్పుడు చూసినా పదుల సంఖ్యలో జనం ఉంటారు. అక్కడ ఇడ్లీ తీసుకోవాలంటే పది నిమిషాలైనా పడుతుంది. 

రీల్స్, షార్ట్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ ఇడ్లీ కొట్టు సూపర్ పాపులర్ అయింది. స్వయంగా వెంకిటేషే అక్కడ ఇడ్లీ సర్వ్ చేసేవాడు. విశేషం ఏంటంటే.. నటుడిగా అవకాశాలందుకుని, కొంచెం పాపులర్ అయ్యాక కూడా అతనేమీ ఆ ఇడ్లీ కొట్టును మూసేయలేదు. ఇప్పటికీ అది అలాగే నడుస్తోంది. అప్పుడప్పుడూ వెంకిటేష్ వెళ్లి తనకు అలవాటైన పనిని కొనసాగిస్తుంటాడు. ‘కింగ్‌డమ్’ సినిమాలో తన పాత్ర క్లిక్ అయితే టాలీవుడ్లో బాగానే అవకాశాలు అందుకునేలా ఉన్నాడు వెంకిటేష్.