హరిహర వీరమల్లు చూసిన వాళ్లంతా.. ప్రథమార్ధం బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగ్లో మంచి హై వచ్చిందని.. కానీ ద్వితీయార్ధమే తేడా కొట్టిందని అంటున్నారు. కోహినూర్ వజ్రాన్ని వీరమల్లు ఎలా తీసుకొస్తాడనే నేపథ్యంలోనే కథను నడిపించి ఉంటే ఆసక్తికరంగా ఉండేదని.. అది వదిలేసి వీరమల్లు ఢిల్లీ ప్రయాణాన్ని, ధర్మ పరిరక్షకుడిగా అతడి ఫ్లాష్ బ్యాక్ను చూపించి కథను పక్కదారి పట్టించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా మధ్యలో సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న జ్యోతికృష్ణ క్రియేటివియేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సినిమాను క్రిష్యే డైరెక్ట్ చేసి ఉంటే ఔట్ పుట్ వేరేలా ఉండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కథ పరంగా మార్పులు చేర్పుల గురించి జ్యోతికృష్ణ స్పందించాడు. క్రిష్ కథను తాము మార్చిన మాట వాస్తవమేనన్నాడు. అందుకు కారణమేంటో అతను వివరించాడు. క్రిష్ కథ పూర్తిగా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరిగేదని.. మాయాబజార్ తరహాలో వినోదాత్మకంగా సాగేలా ఆయన కథను రాసుకున్నారని జ్యోతికృష్ణ తెలిపాడు. ఐతే షూటింగ్కు చాలా సార్లు బ్రేక్ పడడం.. ఆలస్యం కావడంతో ఆ వెర్షన్ను పూర్తి చేయలేకపోయామని జ్యోతికృష్ణ తెలిపాడు.
క్రిష్ వెర్షన్ పూర్తి చేయాలంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉండేదని.. పవన్ కాల్ షీట్లు కూడా ఎక్కువ అవసరమని.. అలా చేయడం వీలు కాక కథను మార్చాల్సి వచ్చిందని జ్యోతికృష్ణ తెలిపాడు. క్రిష్ వెర్షన్ కథను హరిహర వీరమల్లు రెండో భాగంలో చూడొచ్చని అతను చెప్పాడు. కానీ ఇప్పుడు మార్చిన కథ వల్ల వీరమల్లు ట్రాక్ తప్పిందన్నది వాస్తవం. సెకండాఫ్ బోరింగ్గా తయారైంది. పైగా పేలవ విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద మైనస్ అయ్యాయి. దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ పార్ట్కు ఆశించిన ఫలితం రానపుడు ఇక రెండో భాగం తీయడం కష్టమే. అసలు పవన్కూ అంత ఖాళీ లేదు. ఈ సినిమా మీద డబ్బులు పెట్టే స్థితిలో నిర్మాత ఏఎం రత్నమూ లేడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates