నిఖిల్ చెప్పింది ఆలోచించాల్సిన విషయమే

ఎంతసేపూ టికెట్ రేట్లు పెరగడం వల్లే జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారనే కోణంలోనే చర్చ జరుగుతోంది తప్ప నిజానికి క్యాంటీన్ లో అధిక ధరలకు అమ్ముతున్న స్నాక్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతోందో ఇండస్ట్రీ పెద్దలు గుర్తించడం లేదు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్పించి అవి అమలవుతున్న దాఖలాలు కనిపించవు. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ దోపిడీ మాములుగా లేదు. పెద్ద స్టార్ హీరో సినిమాకు నైజాంలో గరిష్ట టికెట్ ధర 295 రూపాయలు ఉంటే పాప్ కార్న్ స్టార్టింగ్ రేట్ 300 నుంచి 900 రూపాయల దాకా ఉంటుంది. వాటర్ బాటిల్ వందకు అమ్ముతున్న ఉదాహరణలు ఎన్నో.

తాజాగా హీరో నిఖిల్ దీని గురించి ఒక ట్వీట్ వేసి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సీరియస్ గా పరిష్కారం చూడాలని కోరాడు. తనకు సినిమా టికెట్ కు అయిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ స్నాక్స్ కు పెట్టానని పేర్కొన్నాడు. ఇమేజ్, సంపాదన, ప్యాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న మార్కెట్ ఉన్న నిఖిల్ కే అలా అనిపిస్తే ఇక మధ్య తరగతి ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. పిల్లలు అడిగితే కొనివ్వడకుండా ఉండలేని నిస్సహాయతను అనుభవించడం కన్నా అసలు మల్టీప్లెక్సులకే దూరంగా ఉంటే బెటరనే అభిప్రాయం మిడిల్ క్లాస్ జీవుల్లో ఉంది. అందుకే వీక్ డేస్ లో చాలా స్క్రీన్లు జనం లేక షోలు క్యాన్సిలవుతూ ఉంటాయి.

కార్పొరేట్ ముసుగులో జరుగుతున్న ఈ దందా పూర్తిగా ఆపేయలేం కానీ కనీస నియంత్రణ అవసరం చాలా ఉంది. నిఖిల్ అన్నట్టు ఒక నీళ్ల బాటిల్ తీసుకెళ్లే స్వాతంత్రం లేనప్పుడు ఖర్చు మీద అదుపు ఎలా వస్తుంది. వసూళ్ల మాయలో పడి ఈ స్నాక్స్ ధరలు చేస్తున్న చేటు చాలా మంది గుర్తించడం లేదు. వీటి వల్ల ఎక్కువగా దెబ్బ తింటున్నది చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ సినిమాలే. అందుబాటు రేట్లలో ఇటు టికెట్ల లేక, అటు తినుబండారాలు లేక మొత్తంగానే థియేటర్ కు దూరమవుతున్నారు. కేవలం ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చినప్పుడు మాత్రమే టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు మారాల్సింది ఇది.