కీర్తి సురేష్ సినిమాలో ‘ఉప్పు’ సరిపోయిందా

టాలీవుడ్ లో కొన్ని కాంబోలు వినగానే ఆశ్చర్యం, షాక్ కలిగిస్తాయి. కీర్తి సురేష్, సుహాస్ కలయికలో ఉప్పు కప్పురంబు ప్రకటించినప్పుడు ఆడియన్స్ ఇదే ఫీలయ్యారు. మహేష్ బాబు, విక్రమ్, సూర్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో జట్టు కట్టిన మహానటి హఠాత్తుగా రూటు మార్చడం పట్ల ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీలయ్యారు. అయితే ఈ కాంబినేషన్ థియేటర్ కోసం కాకుండా ఓటిటికి పరిమితం చేయడం గమనించాల్సిన విషయం. నిన్న అర్ధరాత్రి నుంచి ఉప్పు కప్పురంబు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఐవి శశి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వైరెటీ పాయింట్ ని తీసుకున్నారు.

తండ్రి చనిపోవడం వల్ల చిట్టి జయపురం అనే ఊరి బాధ్యతలు చిన్న వయసులోనే తీసుకుంటుంది అపూర్వ (కీర్తి సురేష్). పదవి ఎక్కగానే సమస్య వస్తుంది. స్మశానంలో చోటు అయిపోయి కేవలం ఇంకో నలుగురికి మాత్రమే పూడ్చేంత జాగా మిగులుతుంది. దీనికి పరిష్కారం కోసం కాటికాపరి చిన్న (సుహాస్) తో కలిసి ప్లాన్లు వేస్తుంది. అయితే గ్రామంలో ఉండే వర్గాలు, విభేదాలు కొత్త తలనెప్పిని తెప్పిస్తాయి. చివరికి దీనికి ఎలాంటి ముగింపు దొరికిందో చూడటమే స్టోరీ. కొంచెం డిఫరెంట్ గా అనిపించే బ్యాక్ డ్రాప్ తీసుకున్న శశి దాని పూర్తి స్థాయి వినోదాత్మకంగా చెప్పడంలో తడబడ్డాడు.

చావు కాన్సెప్ట్ ని సీరియస్ గా చెప్పాలి. దాని మీద కామెడీ అల్లుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రతిరోజు పండగేలో మారుతీ దాన్ని సమర్ధవంతంగా డీల్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఉప్పు కప్పురంబులో అది మిస్ అయ్యింది. న్యాచులారిటీకి భిన్నంగా ఆర్టిస్టులతో ఓవర్ పెర్ఫార్మన్స్ చేయించి చాలా చోట్ల చికాకు పుట్టిస్తారు. కొన్ని జోకులకు నవ్వు రాదు సరికదా కోపం వస్తుంది. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ వీక్ నెస్ లను కవర్ చేయడానికి అవి ఎంత మాత్రం సరిపోలేదు. అవసరం లేని సీన్లు చాలానే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మెప్పించడానికి సరిపడా ‘ఉప్పు’ సినిమాలో మిస్సయ్యింది.