ఈ మధ్య కాలంలో ఒక డబ్బింగ్ సినిమా హక్కుల కోసం విపరీతంగా పోటీ నడిచిందంటే.. అది ‘కూలీ’ కోసమే అని చెప్పాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రానికి అటు తమిళంలో, ఇటు తెలుగులో మామూలు హైప్ లేదు. ‘జైలర్’ను మించి ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి. రజినీ, లోకేష్ కాంబినేషన్కు తోడు.. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రను చేయడం హైప్ను పెంచింది. ఇది కోలీవుడ్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనే అంచనాలున్నాయి.
తెలుగులో కూడా సినిమాకు భారీ వసూళ్లు వస్తాయన్న అంచనాతో డబ్బింగ్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏషియన్ సునీల్, సితార నాగవంశీ, సురేష్ బాబు, అక్కినేని నాగార్జున.. ఇలా చాలామంది పోటీలో నిలిచారు. ఒక దశలో నాగార్జునే సినిమాను సొంతం చేసుకోబోతున్నారని.. రేటు రూ.40 కోట్ల పైమాటే అని వార్తలు వచ్చాయి. ఐతే చివరికి చూస్తే ఏషియన్ సునీల్ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇండస్టీ వార్తల ప్రకారం నాగార్జున ఆఫర్ చేసిన మొత్తం కంటే రూ.10 కోట్ల ఎక్కువకు ఆయన రైట్స్ తీసుకున్నారట. ఆయన ఏకంగా రూ.52 కోట్లకు సినిమాను కొన్నట్లు సమాచారం.
ముందు నాగార్జునకు ప్రయారిటీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఏషియన్ సునీల్ ఊహించని రేటు ఆఫర్ చేయడంతో నిర్మాతలు అటువైపే మొగ్గినట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.100 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. ఇది చాలా పెద్ద టాస్కే. కానీ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే లాభాలు ఖాయమనే అంచనాలున్నాయి. ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఆగస్టు 14న ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల ‘వార్-2’ కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates