కె.ఎం.రాధాకృష్ణన్.. తెలుగు సంగీత ప్రియుల మీద బలమైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు. ఆనంద్, గోదావరి, చందమామ లాంటి చిత్రాల్లో తన పాటలు, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలు వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇంకా తెలుగు ఫ్యామిలీస్ ఇళ్లలో ఈ పాటలు మార్మోగుతూనే ఉన్నాయి. ఐతే శేఖర్ కమ్ముల పరిచయం చేసిన ఈ సంగీత దర్శకుడు.. ఒక దశ తర్వాత అంచనాలను అందుకోలేకపోయాడు.
తన శైలికి తగ్గ సినిమాలు పడకపోవడం వల్లో ఏమో.. తన పాటలు క్లిక్ కాలేదు. రాధాకృష్ణన్ నుంచి అద్భుతమైన పాటలు రాబట్టుకున్న కమ్ముల, కృష్ణవంశీ.. మళ్లీ తనతో కలిసి పని చేయలేదు. బలాదూర్ సహా అతను కొన్ని పేరున్న సినిమాలకే పని చేశాడు కానీ.. తన ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు. చాలా ఏళ్లుగా తన పేరే వినిపించడం లేదు. ఒకప్పటి రాధాకృష్ణన్ పాటలు విన్నపుడల్లా ఇంతటి ప్రతిభావంతుడు ఏమైపోయాడో అనిపిస్తుంది.
ఐతే గతంలో రాధాకృష్ణన్కు బ్రేక్ ఇచ్చిన శేఖర్ కమ్ములనే మళ్లీ అతణ్ని టాలీవుడ్లోకి తిరిగి తీసుకురావాలని చూస్తున్నాడు. ‘కుబేర’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న కమ్ముల.. తన తర్వాతి చిత్రం గురించి మాట్లాడుతూ, మళ్లీ రాధాకృష్ణన్తో పని చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. ఆనంద్, గోదావరి చిత్రాలకు రాధాకృష్ణన్ అద్భుతమైన పాటలు ఇచ్చాడని.. ఐతే ‘హ్యాపీ డేస్’తో తమ కాంబినేషన్ బ్రేక్ అయిందని కమ్ముల చెప్పాడు.
అది మోడర్న్ సినిమా కావడంతో క్లాసికల్ టచ్ ఉన్న రాధాకృష్ణన్ పాటలు దానికి నప్పవన్న ఉద్దేశంతో తనతో పని చేయలేకపోయానని కమ్ముల చెప్పాడు. మళ్లీ రాధాకృష్ణన్తో కచ్చితంగా పని చేస్తానని.. టాలెంట్ ఎక్కడికీ పోదని, గ్యాప్ వచ్చినా సరే రాధాకృష్ణన్ మళ్లీ వస్తాడని కమ్ముల ధీమా వ్యక్తం చేశాడు. తన తర్వాతి సినిమా ఫక్తు ప్రేమకథగా ఉంటుందని.. హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీశాక లవ్ స్టోరీలు తీయడం తనకు అలవాటని.. కొత్తగా ఉండే ప్రేమకథ చేయాలనుకుంటున్నానని.. దాని కోసం కొంచెం టైం తీసుకుంటానని కమ్ముల చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates