ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే అతి పెద్ద హిట్లలో ఒకటి.. దంగల్. వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ ఇదే. ఫస్ట్ రిలీజ్లో వరల్డ్ వైడ్ రూ.800 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత చైనాలో విడుదలై రూ.1200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా రూ.2 వేల కోట్లతో చరిత్ర సృష్టించింది. ఐతే ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం.. పాకిస్థాన్లో మాత్రం విడుదల కాలేదు. అక్కడ ఆమిర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన అంతకుముందు చేసిన చిత్రాలు మంచి ఫలితాన్నీ అందుకున్నాయి. కానీ ‘దంగల్’ సినిమాలో భారత జెండాను, జాతీయ గీతాన్ని చూపించే సన్నివేశాలను తొలగించడానికి చిత్ర బృందం అంగీకరించకపోవడంతో పాక్లో నిషేధం తప్పలేదు.
ఈ నిర్ణయం తీసుకున్నది అప్పటి మంత్రి మరియం ఔరంగజేబ్. ఈ విషయమై ఆమె ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఒక పాడ్ కాస్ట్లో ఆమె ఈ విషయమై తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘‘నేను సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘దంగల్’ రిలీజైంది. సెన్సార్ బోర్డు ప్రతినిధులు, సమాచార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాను. కొన్ని సన్నివేశాలను చూపిస్తూ సినిమాను పాకిస్థాన్లో నిషేధించాలని వారు సిఫారసు చేశారు. ఆ సినిమా చూడకుండానే నేను నిషేధానికి ఆమోదం తెలిపాను.
ఏడాదిన్నర తర్వాత ఆ సినిమా చూసే అవకాశం లభించింది. నా నిర్ణయం తప్పని అప్పుడు గ్రహించాను. అది అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిదాయకమైన సినిమా’’ అని మరియం పేర్కొన్నారు. తనను యాంటీ నేషనల్గా పేర్కొంటూ తన సినిమాలను ఓ వర్గం సోసల్ మీడియాలో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో ‘దంగల్’ను పాక్లో నిషేధించడంపై స్పందించారు. మన జాతీయ గీతం, జెండాకు సంబంధించిన సన్నివేశాలను తొలగించమంటే.. పాకిస్థాన్ నుంచి వచ్చే ఆదాయం వద్దనుకుని అందుకు నిరాకరించినట్లు ఆమిర్ గుర్తు చేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates