నాని 28.. సస్పెన్స్ వీడబోతోంది

నేచురల్ స్టార్ నాని చివరి సినిమా ‘వి’ టాక్ పరంగా చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి. దానికి ముందు ‘జెర్సీ’ని మినహాయిస్తే గత కొన్నేళ్లలో నాని చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచినవే. అతడి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగట్లేదన్నది వాస్తవం. ఐతే ఈ ప్రభావం అతడి భవిష్యత్తు ప్రాజెక్టుల మీద ఎంతమాత్రం కనిపించడం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను అతను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ చేస్తున్న నాని.. ఇటీవలే ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ప్రెస్టీజియస్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది నాని 27వ సినిమా కాగా.. ఇప్పుడు 28వ సినిమాకు ముహూర్తం కుదిరింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించబోతున్నారు.

నాని 28వ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండటం విశేషం. ఆ సంస్థ ట్విట్టర్లో.. ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర పోస్టు పెట్టింది. ‘‘రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం’’ అంటూ నాని 28 హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది మైత్రీ సంస్థ. ఇంతకు ముందు నానితో మైత్రీ వాళ్లు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను నిర్మించారు. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినా సరే.. మళ్లీ అతడితో సినిమాను లైన్లో పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన ఓ కథకు నాని ఓకే చెప్పాడు. అలాగే సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడికి కూడా కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. సుకుమార్‌తో మైత్రీ వాళ్లకున్న అనుబంధం దృష్ట్యా నాని 28కు సుక్కు శిష్యుడే దర్శకుడై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా వివేక్‌తో సినిమాను అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదేమో?