డిజాస్టర్ సినిమాకు వెబ్ సిరీస్ ఎందుకు

ఎంత పెద్ద బడ్జెట్ తో తీసినా ఎంత క్రేజీ క్యాస్టింగ్ ఉన్నా కంటెంట్ బాలేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా మొదటి షోకే తిరస్కరించే రోజులివి. తెరవెనుక 24 క్రాఫ్ట్స్ ఎంత కష్టపడ్డారనేది ఆడియన్స్ కి అనవసరం. తన టికెట్ డబ్బుకు, సమయానికి న్యాయం చేశారా లేదా అనేది మాత్రమే చూసుకుంటాడు. ఉద్దేశపూర్వకంగా ఏదైనా సినిమాని చంపడం సోషల్ మీడియా జమానాలో అయ్యే పని కాదు. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు ఇష్టపడటం లేదు. సూర్యతో తీసిన రెట్రో మంచి చిత్రమని, థియేటర్లకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ తనకు చెప్పారని మళ్ళీ అదే క్యాసెట్ వినిపిస్తున్నారు.

రెట్రోని 40 నుంచి 50 నిమిషాల వరకు ఒక్కో ఎపిసోడ్ కి నిడివి పెట్టి వెబ్ సిరీస్ లా రిలీజ్ చేసే ఆలోచన ఉందని, కానీ నెట్ ఫ్లిక్స్ నుంచి అంత సానుకూల స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలను నెగటివ్ చేస్తున్నారని, అలాంటి వాళ్లకు రెట్రో బలైపోయిందని అన్నారు. అసలు ఎవరి ప్రభావం లేని సామాన్య ప్రేక్షకులు, అభిమానులకు సైతం రెట్రో నచ్చలేదు. కలెక్షన్లలోనూ అది బయట పడింది. నిజంగా కథలో దమ్ముంటే ఎవరూ ఎవరిని ఆపలేరని చాలా సినిమాలు ఋజువు చేశాయి. కానీ కార్తీక్ సుబ్బరాజ్ ఇవన్నీ ఒప్పుకోవడానికి ససేమిరా అంటున్నారు.

ఇప్పుడు చేసిన పొరపాట్లు ఏవో గుర్తిస్తే భవిష్యత్తు అవి రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా నేనో క్లాసిక్ తీశాను, కావాలని చంపేశారు అంటే ఎవరూ సానుభూతి చూపరు. కంగువ టైంలోనూ సూర్య భార్య జ్యోతిక ఇదే తరహాలో బాగున్న సినిమాని కిల్ చేశారని, ఎంత కష్టపడి తీశారో మీకు తెలుసా అంటూ సీరియస్ గానే నిలదీశారు. తర్వాత ఏమయ్యింది. ఫలితం మారలేదుగా. రెట్రో రాసుకోవడం వెనుక కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచనలు ఏవైనా అవి తెరమీదకు సరిగా ప్రొజెక్ట్ కాలేదన్నది వాస్తవం. అయినా డిజాస్టర్ కు వెబ్ సిరీస్ ఏంటో, దాన్ని మళ్ళీ అయిదారు గంటలు చూపించడం ఎంతో అంతు చిక్కడం లేదు.