నిన్న విడుదలైన అఖండ 2 తాండవం టీజర్ ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే 24 మిలియన్లకు పైగా వ్యూస్ తో కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. నిజానికీ వీడియో లాంచ్ అయిన కొన్ని గంటలు సోషల్ మీడియాలో కాస్త ట్రోలింగ్ కనిపించింది. బాలయ్య తలకు త్రిశూలం తిప్పుతూ రౌడీలను నరికే సీన్ మీద యాంటీ ఫ్యాన్స్ జోకులు వేసుకున్నారు. విశ్వంభరకొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దీనినీ వస్తుందదేమోననే అనుమానాలు లేకపోలేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఎలా ఉన్నా బాలయ్య ఫెరోషియస్ అవతారం లోటుపాట్లని కప్పేసి అంచనాలు పెంచేసింది.
దర్శకుడు బోయపాటి శీను పద్దతి మారదు. సింహా నుంచి స్కంద దాకా సిలబస్ ఒకటే. ఓవర్ ది బోర్డు హీరోయిజం తప్పకుండా ఉంటుంది. అతని మాస్ బాలయ్యకు వర్క్ అవుట్ అయినట్టుగా రామ్ చరణ్, రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ల మీద పండలేదు. అందుకే పీక్స్ ఎలివేషన్లన్నీ బాలకృష్ణ మీదే రాసుకుంటాడు బోయపాటి. అఖండ 1లోనూ అలాంటి ఊర మాస్ ఎలివేషన్లు బోలెడున్నాయి. ఇప్పుడిది సీక్వెల్ కాబట్టి అంచనాలు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి హద్దులైనా సరే చెరిపేయాలని బోయపాటి నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టే కేవలం నిమిషం వీడియోలోనే అంత అరాచకం సృష్టించాడు.
ఇదింకా శాంపిలే. అసలు సినిమాలో వేరే లెవెల్ స్టఫ్ ఇస్తాడు బోయపాటి. అవన్నీ ఫిజిక్స్ కి ఛాలెంజ్ చేసేలా ఉంటాయి. ట్రోలర్స్ కి అవకాశమూ ఇస్తాయి. కానీ ఫైనల్ గా తెరమీద చూస్తున్నప్పుడు ప్రేక్షకులు లీనమై వాటిని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేదే ఫలితాన్ని శాశిస్తుంది. బోయపాటి శీను దీన్ని బలంగా నమ్ముతాడు. సో అఖండ 2 రిలీజయ్యాక స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా హై వోల్టేజ్ యాక్షన్ కి ముందే ప్రిపేరవ్వాలి. డోస్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. సెప్టెంబర్ 25 విడుదలని చెప్పారు కానీ ఓజితో క్లాష్ దృష్ట్యా డేట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ టాక్. ఇంకొన్ని వారాలయ్యాక స్పష్టత రావొచ్చు.