మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలకే సినిమా


గత నెల 15 నుంచే దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాకపోతే 50 శాతం కెపాసిటీ సహా ఎన్నో షరతులు పెట్టింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల నామమాత్రంగా తెరుచుకున్నాయి థియేటర్లు. ఐతే కొత్త సినిమాలు లేకపోవడం వల్ల, కరోనా భయంతో జనాలు థియేటర్లకు అయితే రావట్లేదు.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాలు వస్తే థియేటర్లు కాస్తో కూస్తో నిండుతాయి కానీ.. సరైన సినిమాలే లేనపుడు అవెక్కడ కళకళలాడతాయి? ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో తెరకెక్కిన క్లాసిక్ సినిమాలను ప్రధాన మల్టీప్లెక్సులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే, వీర్ జారా, కబీ కబీ, సిల్ సిలా, దిల్‌తో పాగల్ హై, బంటీ ఔర్ బబ్లీ, సుల్తాన్, మర్దాని సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్టీప్లెక్స్ ఛైన్స్ కోసం ఉచితంగా అందిస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. ఈ సంస్థ నెలకొల్పి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ సినిమాలను మల్టీప్లెక్సులకు అందించాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా.

నవంబరు 12 నుంచి 19 వరకు ఈ సినిమాలను పై మల్టీప్లెక్సుల్లో ప్రదర్శిస్తారు. మామూలుగా ఈ మల్టీప్లెక్సుల్లో రూ.150 నుంచి రూ.400 వరకు టికెట్ల రేట్లు ఉంటాయి. కానీ యశ్ రాజ్ వాళ్లు ఉచితంగా ఈ సినిమాలను తమకు అందిస్తున్న నేపథ్యంలో తాము కూడా లాభం చూసుకోకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే ఉద్దేశంతో కేవలం 50 రూపాయల కామన్ టికెట్ రేటుతో ఈ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ మొత్తం కూడా థియేటర్ల మెయింటెనెన్స్ కోసం వసూలు చేస్తున్నదే.