టీనేజీలోనే సంగీత దర్శకుడిగా మారి, కొన్నేళ్లలోనే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. తనది పాతికేళ్ల సంగీత ప్రస్థానం. గత కొన్నేళ్లలో దేవి సంగీతంలో ఊపు తగ్గిందనే విమర్శలున్నప్పటికీ.. తన వర్క్ ఎథిక్ విషయంలో ఏ అభ్యంతరాలూ ఉండేవి కావు. కానీ ఈ మధ్య మాత్రం దేవి సమయానికి ఔట్ పుట్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 చిత్రానికి చివరి దశలో వేరే సంగీత దర్శకులతో ఆర్ఆర్ చేయించుకోవడానికి దేవి వర్క్ నచ్చకపోవడంతో పాటు ఆలస్యం కూడా ఓ కారణమనే చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వివాదం చాలా రోజుల పాటు నానింది. తర్వాత సద్దుమణిగింది.
ఐతే ఇప్పుడు దేవి చుట్టూ మరో వివాదం ముసురుకుంటున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కుబేర చిత్రానికి దేవినే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఇంకో పది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంకా కూడా పాటల పని పూర్తి కాలేదంటూ నిర్మాత సునీల్ నారంగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరినీ షాక్కు గురి చేసింది. దేవి ఇంకా రెండు పాటలు ఇవ్వాల్సి ఉందని ఆయన వెల్లడించారు. దేవిని విమర్శించడం లాంటిదేమీ చేయలేదు కానీ.. ఇంకా రెండు పాటలు ఇవ్వాల్సి ఉందని మాత్రం సునీల్ చెప్పారు. ఇంకో పది రోజుల్లో రిలీజ్ ఉంటే ఇంకా పాటలు పెండింగ్లో పెట్టడం ఏంటనే చర్చ జరుగుతోంది.
కుబేర అనౌన్స్ అయి మూడేళ్లయింది. సినిమా సెట్స్ మీదికి వెళ్లి కూడా ఏడాదిన్నర దాటుతోంది. ఇంత టైం ఉన్నా దేవి సాంగ్స్ పూర్తి చేయడానికి ఇంత టైం తీసుకోవడం ఆశ్చర్యమే. కుబేర ప్రమోషన్లు ఇంకా ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. టీం బయటికి వచ్చి ప్రమోషన్లు చేయడానికంటే ముందు ఆన్ లైన్లో పాటలు తీసుకొచ్చే బజ్ ఎక్కువ. కానీ ఆ పని జరక్కపోవడం మైనస్ అవుతోంది. కుబేర తమిళ వెర్షన్కు ఇటీవల ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించడం గమనార్హం. కానీ నిర్మాతేమో ఇంకా రెండు పాటలు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్ ఎలా చేశారన్నది అర్థంకాని విషయం.