డిజాస్టర్ టాక్.. అయినా టాప్‌లో

థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాల్లో ఏది హిట్టో ఏది ఫట్టో చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది. టాక్ ప్రకారం చూస్తే డిజాస్టర్ అనుకున్న సినిమాలు.. అంచనాల్ని మించి వ్యూయర్ షిప్‌ తెచ్చుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. థియేటర్లలో రిలీజైన సినిమా విషయంలో అయితే కలెక్షన్లను బట్టి దాని ఫలితాన్ని నిర్దేశిస్తాం. కానీ ఓటీటీ సినిమాల విషయంలో ఇలా అంచనా కట్టడం కొంచెం కష్టమే. మొత్తంగా ఎన్ని వ్యూస్ వచ్చాయి.. ఆ సినిమా రిలీజవడంతో కొత్తగా ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి అన్నది కీలకం. ఐతే ఆ వివరాలను ఓటీటీలు రిలీజ్ చేయవు. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం రెస్పాన్స్ ఎలా ఉందనే సంకేతాలను ఓటీటీలు చూచాయిగా వెల్లడిస్తుంటాయి.

అమేజాన్ ప్రైమ్‌లో గత నెల రిలీజైన ‘నిశ్శబ్దం’ సినిమా టాక్ ప్రకారం అయితే డిజాస్టర్ అనే చెప్పాలి. కానీ ఈ చిత్రానికి అనూహ్యమైన వ్యూస్ వచ్చాయని.. ప్రైమ్‌లో నేరుగా రిలీజైన సినిమాలల్లో అది వ్యూయర్ షిప్ పరంగా టాప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పుడు ‘మిస్ ఇండియా’ విషయంలోనూ రెస్పాన్స్ ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. గత బుధవారం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్నుంచి ఆ ఓటీటీలో ఇండియా వరకు నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. రిలీజ్ రోజు మాత్రమే కాదు.. వీకెండ్ అంతా కూడా అదే నంబర్ వన్‌ స్థానంలో ఉంది. ‘సూటబుల్ బాయ్’ రెండో స్థానంలో నిలిచింది. తర్వాత ఇంకేవో షోలు ఉన్నాయి. వేరే కొత్త సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం ‘మిస్ ఇండియా’కు కలిసి వచ్చి ఉండొచ్చు.

కీర్తి సురేష్‌కు తెలుగులో అనే కాక వివిధ భాషల్లో పేరుండటంతో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లంతా టాక్‌తో సంబంధం లేకుండా ఆ సినిమాపై ఓ లుక్ వేద్దామని ప్రేక్షకులు భావించి ఉండొచ్చు. కాబట్టే ఇలా టాప్‌లో ట్రెండ్ అవుతుండొచ్చు. కంటెంట్ పరంగా మాత్రం కీర్తి నటించిన సినిమాల్లో అన్నిటికంటే పేలవమైంది ‘మిస్ ఇండియా’ అనే చెప్పాలి.