టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన దర్వకుల్లో వి.వి.వినాయక్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా చాలామంది పెద్ద స్టార్లతో ఆయన సినిమాలు చేశారు. పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. కానీ ఎలాంటి దర్శకుడైనా ఒక దశ తర్వాత ఔట్ డేట్ అయిపోవడం.. సినిమాలు తగ్గిపోవడం మామూలే. తన తరం స్టార్ డైరెక్టర్లలో ఇప్పటికీ కొందరు మంచి స్థాయిలో ఉండగా.. వినాయక్ మాత్రం ఖాళీ అయిపోయారు.
చివరగా ఆయన తీసిన ‘ఇంటిలిజెంట్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. తర్వాత హిందీలో ‘ఛత్రపతి’ని రీమేక్ చేస్తే అక్కడా అదే అనుభవం ఎదురైంది. దీంతో వినాయక్ లైమ్ లైట్లో లేకుండా పోయారు. మధ్యలో అనారోగ్య సమస్యలతోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ఐతే ఇటీవలే కోలుకుని ఒక ఈవెంట్లో కనిపించడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.
కాగా వినాయక్ ఇప్పుడు మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నారట. నిర్మాతను కూడా రెడీ చేసుకున్నారట. కథలు వింటున్నారు. కానీ హీరోను సెట్ చేయడమే ఇబ్బంది అవుతోందని సమాచారం. వినాయక్ ఫామ్ దృష్ట్యా పెద్ద స్టార్లు ఆయనకు దొరికే అవకాశం లేనట్లే. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్లను గతంలో ప్రయత్నించి విఫలమయ్యారు వినాయక్. ఐతే ఇప్పుడు ఆయన దృష్టి యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ మీద పడిందని.. తనకోసం గట్టిగా ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కానీ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు.. సీనియర్ దర్శకుడైన బొమ్మరిల్లు భాస్కర్తో ‘జాక్’ సినిమా చేసి ఎదురు దెబ్బ తిన్నాడు. అది రాంగ్ డెసిషన్ అని సినిమా రిలీజయ్యాక అర్థమైంది. ఈ పరిస్థితుల్లో తనకు అస్సలు సూట్ కాని మాస్ మసాలా సినిమాలు చేసే వినాయక్తో, అది కూడా ఆయన పూర్తిగా ఫామ్ కోల్పోయిన దశలో చేతులు కలుపుతాడా అన్నది ప్రశ్నార్థకం. సిద్ధు అనే కాదు.. వేరే యంగ్ హీరోలు కూడా వినాయక్కు ప్రస్తుత పరిస్థితుల్లో దొరకడం కష్టమే. కాబట్టి ఆయన రీఎంట్రీ అంత తేలికైన విషయం కాదు.