టిల్లు సిరీస్ లో రెండు సినిమాలు బ్లాక్ బస్టరయ్యాక సిద్దు జొన్నలగడ్డకు జాక్ ఇచ్చిన షాక్ మాములుది కాదు. కనీసం యావరేజ్ అయినా ఏదోలే అని సర్దుకోవచ్చు కానీ దారుణంగా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ బాలేకపోతే ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్ కు సిద్దు ఇంకా చేరుకోలేదనే మెసేజ్ అయితే జాక్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ తెలుసు కదాతో రాబోతున్నాడు. అక్టోబర్ 17 విడుదల చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం సమకూర్చాడు.
ఇది భలే డేటు అనడానికి కారణాలున్నాయి. దసరా పండగ అయిపోయిన తర్వాత స్లాట్ తీసుకోవడం కొందరికి కరెక్ట్ అనిపించకపోవచ్చు కానీ ప్యాన్ ఇండియా మూవీస్ తో తక్కువ గ్యాప్ లో తలపడి కలెక్షన్లు దెబ్బ తీసుకోవడం కన్నా ఇదే మంచి నిర్ణయం. అక్టోబర్ మూడో వారం నాటికి వార్ 2, కూలి, మాస్ జాతర, ఓజి, అఖండ 2, కాంతార చాప్టర్ 1 తదితర సినిమాల థియేటర్ రన్ పూర్తయిపోయి ఉంటుంది. సో తెలుసు కదాకు టాలీవుడ్ వరకు సోలో ఛాన్స్ దక్కుతుంది. అదే తేదీకి రష్మిక మందన్న బాలీవుడ్ హారర్ మూవీ తమని అనౌన్స్ చేశారు కానీ ఖచ్చితంగా వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం.
ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేయడం ద్వారా సిద్ధూ జొన్నలగడ్డ స్పీడ్ పెంచినట్టే అనుకోవాలి. తెలుసు కదాలో హిట్ 3 భామ శ్రీనిధి శెట్టితో పాటు రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. పైకి ముక్కోణపు ప్రేమకథగా కనిపించినా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని టీమ్ చెబుతోంది. మ్యూజికల్ గా తమన్ లోని కొత్త షేడ్ ని ఇందులో చూడొచ్చని అంటున్నారు. మాస్, యాక్షన్ జోలికి వెళ్లకుండా ఇలాంటి కూల్ రామ్ కామ్ ని ఎంచుకోవడం సిద్ధూకి అవసరమే. తెలుసు కదాకు ముందు రోజు మోహన్ లాల్ వృషభ, కార్తీ సర్దార్ 2 కూడా వస్తాయంటున్నారు కానీ కాంపిటీషన్ పరంగా టెన్షన్ ఏం ఉండదు.