ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాథ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ని కలిసి ఫోటోలు తీసుకోవడం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ లైగర్ తర్వాత విజయేంద్రప్రసాద్ ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా కథ ముందే చెప్పమని అడిగారని. తనకు ఫెయిల్యూర్స్ రావడం ఇష్టం లేక అలా కోరుకోవడం చూసి ఎమోషనలయ్యానని అన్నారు. కానీ పూరి వెళ్లి స్టోరీ చెప్పలేదు. భయపడినట్టుగానే సినిమా డిజాస్టరయ్యింది. విజయేంద్ర ప్రసాద్ ని కలిస్తే ఆయన అనుభవం సలహాల రూపంలో దక్కి మరింత మెరుగైన స్క్రిప్ట్ అయ్యేదని జనాలు ప్రశ్నించారు. ఇవన్నీ విన్నారు కాబోలు పూరి ఆ పనే చేశారు.
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించబోయే ప్యాన్ ఇండియా మూవీకి స్టోరీ పరంగా విజయేంద్ర ప్రసాద్ సలహాలు ఇచ్చారని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. రాజమౌళి సక్సెస్ వెనుక ఒక తండ్రిగా కన్నా ఒక రైటర్ గా ఆయన అనుభవం ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు పూరికి గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా మంచి పరిణామమే. సాధారణంగా పూరి బయట రచయితల కథలు, మార్పులు తీసుకోరు. ఒక్క టెంపర్ కి మాత్రం వక్కంతం వంశీ రాసిన సబ్జెక్టుని ఓకే చేశారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ వల్లేననేది ఓపెన్ ఫ్యాక్ట్. సినిమా పెద్ద హిట్టయ్యింది.
ఇప్పుడు పూరి జగన్నాథ్ కు నిజంగా విజయేంద్ర ప్రసాద్ మాట ప్లస్ రాత సాయం చేసి ఉంటే బాగా ప్లస్ అవుతుంది. క్యాస్టింగ్ దగ్గరి నుంచి షెడ్యూలింగ్ దాకా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటున్న పూరి ఈసారి బలమైన కంబ్యాక్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. విలన్ గా దునియా విజయ్ తో పాటు టబు అఫీషియల్ క్యాస్టింగ్ లో చేరిపోయారు. నివేదా థామస్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. రాధికా ఆప్టే తానీ మూవీలో లేనని తేల్చి చెప్పేసింది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమాకు త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోగా రిలీజ్ చేయాలనేది టార్గెట్. పూరి వేగానికి ఇదేమంత కష్టం కాదు.