వింతల్లో వింత : ఒక సినిమా 2 క్లైమాక్సులు

జూన్ 6 విడుదల కాబోతున్న బాలీవుడ్ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 5 దర్శక నిర్మాతలు ఒక వెరైటీ ప్రయోగం చేశారు. రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి కొన్ని థియేటర్లలో ఒకటి, ఇతర స్క్రీన్లలో వేరొకటి ప్రదర్శించబోతున్నారు. ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఇవాళ ట్రైలర్ లాంచ్ లో చెప్పడం చూసి అందరూ షాక్ తిన్నారు. రెండు వెర్షన్లకు సెన్సార్ విడివిడిగా చేయించడం విశేషం. అయితే ఎక్కడ ఏ క్లైమాక్స్ ఉందో సినిమా చూస్తే కానీ తెలియదట. ఉదాహరణకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఎండింగ్ ఒకలా ఉంటే దానికి దగ్గర్లో ఉండే పివిఆర్ పంజాగుట్టలో ఇంకోలా ఫినిషింగ్ ఉంటుందన్న మాట. రెండు షోలు చూస్తేనే తేడా తెలుస్తుంది.

ఇలా ఎందుకు చేశారంటే కిక్కు కోసమని రవితేజ స్టైల్ లో చెబుతున్నారు. నిజానికి ఇలా రెండు క్లైమాక్స్ లు తీయడం ఇదేం మొదటిసారి కాదు. ఆల్ టైం క్లాసిక్ షోలే చివరి ఘట్టాన్ని రెండు రకాలుగా తీశారు. ఒకదాంట్లో అంజాద్ ఖాన్ ని సంజీవ్ కుమార్ చంపే సీన్ ఉంటే మరొకటి అంజాద్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఉంటుంది. సెన్సార్ అభ్యంతరం మేరకు రెండోదాన్ని లాక్ చేశారు నిర్మాత. యూట్యూబ్ లో ఈ వ్యత్యాసం చూడొచ్చు. కృష్ణ, నాగార్జున కలయికలో వచ్చిన వారసుడులో ముందు కృష్ణ చనిపోయినట్టుగా చూపిస్తారు. ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తర్వాత హ్యాపీ ఎండింగ్ గా మార్చేశారు.

ఇలా పలు ఉదాహరణలున్నాయి కానీ హౌస్ ఫుల్ 5 మాత్రం వీటికి భిన్నంగా ప్లాన్ చేసింది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశముఖ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, జాకీ శ్రోఫ్, నానా పాటేకర్, జానీ లివర్, నర్గిస్ ఫక్రే, సోనమ్ బాజ్వా, ఫర్దీన్ ఖాన్, డినో మోరియా ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు తరుణ్ మన్సుఖని దర్శకత్వం వహించారు. కథలో అసలు హంతకుడు ఎవరనే దాని మీద రెండు ట్విస్టులు పెట్టారట. వాటి నుంచి థ్రిల్ ఇవ్వడం కోసమే రెండు క్లైమాక్స్ లు పెట్టామని చెబుతున్న హౌస్ ఫుల్ బృందం చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది.