మంచు కుటుంబంలో ఇప్పుడు మిగతా వాళ్లంతా ఒక వైపు ఉంటే.. మనోజ్ వేరైపోయాడు. అనివార్య పరిస్థితుల వల్ల అతను తన తండ్రి ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. తండ్రి మోహన్ బాబు సైతం కొడుకును దూరం పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి మనోజ్ తల్లి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. ఆమె మోహన్ బాబుతో కలిసి జల్పల్లిలోని ఇంటిలోనే ఉంటున్నారు. మరి కన్న బిడ్డ దూరమైతే ఆమె ఎంత బాధ పడుతూ ఉంటుందో అంచనా వేయొచ్చు.
మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మనోజ్ను కలుస్తోందా లేదా.. అన్నదీ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మంచు మనోజ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మొత్తం గొడవలో తన తల్లికి దూరం కావడమే అత్యంత బాధ కలిగించే విషయమని అతను వ్యాఖ్యానించాడు. ఆమె అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. తాను వెళ్లి ఆమెను కలవడానికి మాత్రం చాలా కండిషన్లు పెట్టారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
“నేను అమ్మను ఎక్కువ మిస్ అవుతున్నా. అమ్మను కలవాలంటే చాలా కండిషన్లు పెట్టారు. అందుకు అనుమతి తీసుకోవాలి. నేను వెళ్తే ఆమె బయటికి వచ్చి కలుస్తుంది. అప్పుడప్పుడూ అమ్మ మా వద్దకు వస్తుంది. మా పాప అంటే అమ్మకు చాలా ఇష్టం. తను కూడా మమ్మల్ని చాలా మిస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. గొడవల వల్ల అక్కను కావాలనే దూరం పెట్టాను. ఇటీవల ఆమె చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్కు నేను వస్తానో రానో తనకు తెలియదు. తన కోసమే వెళ్లాను. చాలా ఎమోషనల్ అయింది. నేను ఏమైపోతానో అని అక్క భయపడింది. నేను గొడవలు వద్దనే కోరుకుంటున్నా. కూర్చుని మాట్లాడదామంటున్నా. ఇంత జరిగినా నాకు వాళ్ల మీద ప్రేమ తప్ప ద్వేషం లేదు. నా పాపను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా” అని మనోజ్ తెలిపాడు.