-->

ఒక్క భాగమే అంటున్న విజయ్ దేవరకొండ

వరస హిట్లు లేకపోయినా ప్యాన్ ఇండియా సినిమాలు ఒళ్ళోకొచ్చి పడుతున్న విజయ్ దేవరకొండకు కింగ్ డమ్ మీద చాలా ఆశలున్నాయి. ముందు అనుకున్న ప్రకారం మే 30 విడుదలవుతుందనే ఉద్దేశంతో కొన్ని తమిళ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. వాటిలో కొన్ని కీలకమైన విషయాలు బయట పడ్డాయి. కింగ్ డమ్ ప్రస్తుతానికి ఒకే భాగమని, కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సృష్టించిన ప్రపంచంలో ఎన్నో పాత్రలు, కథలు ఉన్నాయని, ఒకవేళ కొనసాగింపు చేయాల్సి వస్తే నేనే హీరోగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అంటే కింగ్ డమ్ సింగల్ పార్ట్ కి పరిమితమనే క్లారిటీ వచ్చేసింది.

జెర్సీ చూశాక గౌతమ్ తిన్ననూరి ఎమోషన్లను ఆవిష్కరించిన తీరుకి ఫిదా అయిపోయానని చెబుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయని ఊరిస్తున్నాడు. స్టోరీకి సంబంధించిన క్లూస్ ఇవ్వలేదు కానీ తమిళ ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి ఒక కారణముంది. కింగ్ డమ్ శ్రీలంకలో స్థిరపడిన తమిళ శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఇటీవలే సెన్సేషనల్ హిట్ గా నిలిచిన టూరిస్ట్ ఫ్యామిలీలో తీసుకుంది ఈ నేపధ్యమే. కాకపోతే ఇందులో ఫన్నీగా చూపిస్తే కింగ్ డమ్ లో దశాబ్దాల వెనక్కు వెళ్లి చాలా సీరియస్ నెరేషన్ లో ఇంటెన్స్ గా  చెప్పబోతున్నారు.

జూలై 4కి వెళ్ళిపోయిన ఈ పీరియడ్ డ్రామాకు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ పాత్ర హైలైట్స్ లో ముఖ్యమైనవిగా చెబుతున్నారు. డెబ్భై దశకంలో శ్రీలంకలో తీవ్ర అణిచివేతకు గురైన భారతీయల కోసం పోరాడే క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ నుంచి ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఆశించవచ్చు. ఫైనల్ గా కింగ్ డమ్ ఒక్క భాగమేననే స్పష్టత అయితే వచ్చేసింది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కొనసాగింపులో ఎవరితో తీయాలని ప్లాన్ చేస్తారేమో. ఇదయ్యాక సితార సంస్థలోనే గౌతమ్ తిన్ననూరి తీసిన మేజిక్ పనులు ప్రారంభమవుతాయి.