అవును.. ఆ సూపర్ స్టార్లు కలుస్తున్నారు

భాష ఏదైనా సరే.. ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి ఒక సినిమా చేస్తే దానిపై ఉండే ఆసక్తే వేరు. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయకపోయినా.. ఒక సూపర్ స్టార్ సినిమాలో మరో సూపర్ స్టార్ అతిథి పాత్ర చేసినా దానికి వచ్చే హైపే వేరుగా ఉంటుంది. హిందీలో బిగ్గెస్ట్ స్టార్లయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు.

వాళ్లిద్దరూ కలిసి చేసిన ‘కరణ్ అర్జున్’ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత ఇద్దరూ పూర్తి స్థాయి మల్టీస్టారర్లు చేయలేదు కానీ.. దుష్మన్ దునియా కా, ఓం శాంతి ఓం, ట్యూబ్ లైట్, జీరో లాంటి చిత్రాల్లో తెరను పంచుకున్నారు.

ఇవన్నీ చాలా వరకు ఒకరి సినిమాల్లో ఇంకొకరు అతిథి పాత్రలు చేసినవే. ముఖ్యంగా షారుఖ్ సినిమాల్లో సల్మాన్ అతిథి పాత్రలు చేసిన సందర్భాలే ఎక్కువ. షారుఖ్ నుంచి చివరగా వచ్చిన ‘జీరో’లో కూడా సల్మాన్ క్యామియో చేశాడు. ఇప్పుడు ఇలాంటి మరో సినిమా రాబోతోంది. అదే.. పఠాన్.

‘జీరో’ తర్వాత రెండేళ్ల విరామం తీసుకున్న షారుఖ్ త్వరలోనే యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ‘పఠాన్’ పేరుతో భారీ చిత్రం మొదలు పెట్టనున్నాడు. ఇందులో జాన్ అబ్రహాం విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించబోయే ఈ చిత్రంలో సల్మాన్ అతిథి పాత్ర చేయనున్నాడన్నది తాజా సమాచారం. అతి త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రంలో షారుక్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. అందుకోసం పది రోజుల డేట్లు కేటాయించాడట.

కెరీర్ ఆరంభంలో కలిసి నటించాక.. మధ్యలో షారుఖ్, సల్మాన్ మధ్య వైరం నెలకొని ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఇద్దరి మధ్య అడ్వర్టైజ్మెంట్ వార్స్ కూడా జరిగాయి. వారి అభిమానులైతే శత్రువుల్లాగే మెలిగారు. కానీ తర్వాత ఇద్దరూ ఒకరి సినిమాల్లో ఒకరు నటించడం మొదలైంది. షారుఖ్ పూర్తిగా డౌన్ అయిన టైంలో ‘జీరో’లో క్యామియోకు సల్మాన్ ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమాకది ఉపయోగపడలేదు. ఇప్పుడు షారుఖ్ కచ్చితంగా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్న సమయంలో రానున్న ‘పఠాన్’లో నటించి సల్మాన్ మరోసారి తన మిత్రుడికి సాయ పడే ప్రయత్నం చేస్తున్నాడు.