తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన జయం రవి కుటుంబ వివాదం కొంత కాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. అతను తన భార్య ఆర్తితో 18 ఏళ్ల వైవాహిక బంధానికి తెర దించబోతున్నట్లు గత ఏడాది ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ బెస్ట్ కపుల్స్లో ఒకటి పేరు తెచ్చుకున్న జంట ఇలా విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే జయం రవి ఈ విడాకుల గురించి ప్రకటించాక ఆర్తి లైన్లోకి వచ్చి.. తన భర్త నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని.. తమ బంధాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నానని చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. కానీ వీరి బంధం నిలవలేదు. విడాకుల కేసు కోర్టుకు వెళ్లింది. జయం రవి.. భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు.
రవికి మరో అమ్మాయితో సంబంధం ఏర్పడడమే భార్య నుంచి విడిపోవడానికి కారణమని ఇంతకుముందు వార్లు వచ్చాయి.
తాజాగా ఈ విషయం రూఢి అయింది. కెవిషా అనే సింగర్తో జయం రవి రిలేషన్షిప్లో ఉన్న విషయం బయటపడిపోయింది అనే పుకారు చక్కర్లు కొడుతుంది. తాజాగా కోలీవుడ్లో జరిగిన ఒక పెళ్లికి కెవిషాతో కలిసి హాజరవడమే కాక.. ఫొటోలకు పోజులిచ్చాడు రవి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాతి రోజే ఆర్తి తీవ్ర ఆవేదనతో మీడియాకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇంకా తమకు అధికారికంగా విడాకులు రాకముందే రవి ఇలా మరో అమ్మాయితో కలిసి తిరగడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
రవి ఎలాంటి వాడో అర్థం చేసుకోండంటూ తన పేరు పెట్టకుండా విమర్శలు గుప్పించింది. రవి.. తమ ఇద్దరు పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదని.. వారి పోషణకు డబ్బులు కూడా ఇవ్వట్లేదని.. తమ తండ్రి తమను కలవకపోవడం, పట్టించుకోకపోవడం, మరో మహిళతో కలిసి తిరగడం చూసి పిల్లలు ఎంత వేదన అనుభవిస్తుంటారో అర్థం చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించింది. తాను ఈ సమయంలో ఏడుస్తూ కూర్చోనని.. పిల్లల కోసం బలంగా నిలబడతానని ఆమె పేర్కొంది. రవితో తనకు ఇంకా అధికారికంగా విడాకులు రాలేదని.. కాబట్టి ఇంకా తన పేరు వెనుక అతడి పేరు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.