సర్ప్రైజ్….ట్రెండ్ అవుతున్న వింటేజ్ క్లాసిక్

ఈ మధ్య రీ రిలీజులకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. అందులోనూ ముప్పై నలభై సంవత్సరాల క్రితం వచ్చిన వాటిని మళ్ళీ థియేటర్లలో చూసేందుకు వింటేజ్ ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు కానీ ఇప్పటి మూవీ లవర్స్ కాదు. అందుకే ఆదిత్య 369కు ఎంత మంచి ప్రమోషన్లు చేసినా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఈ నేపథ్యంలో జగదేకవీరుడు అతిలోకసుందరిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానం జనంలో లేకపోలేదు. అయితే మెల్లగా ఈ వింటేజ్ క్లాసిక్ బుక్ మై షో ట్రెండ్స్ లోకి వచ్చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో 6 వేల దాకా టికెట్లు అమ్ముడుపోయి శుభ శకునాలనే చూపిస్తోంది.

ఇది మరీ పెద్ద నెంబర్ కాకపోయినా రేపటి కొత్త రిలీజులు శ్రీవిష్ణు సింగిల్, సమంత శుభం కన్నా ముందుగా ట్రెండింగ్ లో రావడం విశేషమే. వైజయంతి మూవీస్ చేస్తున్న ప్రమోషన్లు దానికి దోహదం చేస్తున్నాయి. క్రమం తప్పకుండ ప్రోమోలు వదలడం, కౌంట్ డౌన్ పోస్టర్లు, చిరంజీవి రాఘవేంద్రరావుతో సుమ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ, రీ స్టోరేషన్ కోసం టీమ్ పడిన కష్టాలతో కూడిన ఒక వీడియో ఇవన్నీ ఆసక్తి పెంచేందుకు దోహదం చేశాయి. 1990 మే 9 రిలీజైన జగదేకవీరుడు అతిలోకసుందరి సరిగ్గా ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత తిరిగి అదే డేట్ కి విడుదల కానుండటం అభిమానులకు స్పెషల్ మెమరీ అవుతోంది.

హైదరాబాద్ లో సుదర్శన్, భ్రమరాంబ తదితర సింగల్ స్క్రీన్ల మార్నింగ్ షోలు ఆల్రెడీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్లో నాలుగు 3డి షోలు వేస్తే ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తోంది. పలు చోట్ల స్టాండీస్ పెట్టి వాటి ముందు జనాలు ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకునేలా చేసిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీ తీసుకొస్తున్నాయి. ఇంత పాత సినిమాని 3డి సాంకేతికలో ఎలా మార్చారనే ఆసక్తి ఆడియన్స్ లో లేకపోలేదు. చిరు శ్రీదేవి గ్రేస్ ఫుల్ స్టెప్పులు, ఇళయరాజా అద్భుతమైన పాటలు, దర్శకేంద్రుడి మాయాజాలం వెరసి ఒక మంచి అనుభూతి ఇవ్వగలిగితే కనక మరోసారి ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.