ముప్పై ఆరు సంవత్సరాల క్రితం 1990 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నప్పుడు థియేటర్లకు జనాలు వస్తారా రారా అని నిర్మాతలు భయపడుతున్నప్పుడు అశ్వినిదత్ జగదేకవీరుడు అతిలోకసుందరిని మే 9 విడుదల చేశారు. చాలా చోట్లకు ప్రింట్లు లేట్ గా వెళ్లాయి. ఎన్నో సినిమా హాళ్లల్లో మోకాలు లోతు నీరు చేరిపోయినా సరే అదేం లెక్క చేయకుండా ఆడియన్స్ వచ్చారు. చిరంజీవి, శ్రీదేవి జంటను తెరమీద చూసి మురిసిపోయారు. ఇళయరాజా పాటలకు వాళ్లిదరూ డాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ మురిసిపోతూ తమ కాలు కదిపారు. ఇదంతా జరిగి మూడు దశాబ్దాలు అయిపోయింది.
మరోసారి కొత్త తరాన్ని మైమరిపింపజేసేందుకు జగదేకవీరుడు జంట సిద్ధమవుతోంది. అది కూడా 3డిలో. వైజయంతి మూవీస్ సరికొత్త రీ మాస్టర్ ప్రింట్ ని అదే మే 9 మరోసారి థియేటర్లకు తీసుకొస్తోంది. అయితే అంత వింటేజ్ క్లాసిక్ ని త్రీడిలోకి మార్చడం ఎవరూ ఊహించనిది. ఇప్పటికే టీవీ, యూట్యూబ్ లో కొన్ని వేలసార్లు చూసినా రాని అనుభూతి ఇప్పుడు కొత్తగా ఇవ్వబోతున్నారు. టాలీవుడ్ లో ఒక పాత సినిమాని ఇలాంటి సాంకేతికతలోకి మార్చడం బహుశా ఇదే మొదటిసారని చెప్పాలి. శాటిలైట్, ఓటిటిలు విస్తృతంగా పెరిగాక ఈ సినిమా రీరిలీజ్ కు నోచుకోలేదు. అందుకే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది.
కె రాఘవేంద్రరావు దర్శకత్వం, అబ్బురపరిచే విజువల్స్, ఫాంటసీ బ్యాక్ డ్రాప్, మానవా మానవా అంటూ శ్రీదేవి అమాయకపు నటన, గైడ్ రాజుగా చిరంజీవి ఆల్ ఇన్ వన్ మాస్ మ్యానరిజమ్ ఒకటా రెండా పైసా వసూల్ అంశాలు ఇందులో బోలెడున్నాయి. ముఖ్యంగా అబ్బని తీయని దెబ్బ, జై చిరంజీవా జగదేకవీర, యమహో నీ యమయమా పాటలు అప్పట్లో హోరెత్తిపోయాయి. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన షాలిని ఇప్పుడు అజిత్ భార్య కాగా బేబీ షామిలి ఓయ్, అమ్మగారిల్లు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి, అల్లురామలింగయ్య, రామిరెడ్డి కాలం చేసినా మిగిలిన క్యాస్టింగ్ ఉంది కాబట్టి వాళ్లతో గ్రాండ్ ప్రమోషన్లు ప్లాన్ చేస్తారట.