నాగశౌర్య.. వరుడు కావలెను

టాలీవుడ్లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ తీరిక లేకుండా పని చేసుకుపోతున్న హీరోల్లో నాగశౌర్య ఒకడు. సొంత బేనర్లో చేసిన ‘ఛలో’తో అతడి కెరీర్ మలుపు తిరగ్గా.. అప్పటి నుంచి ఆపకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. కరోనా వల్ల బ్రేక్ వచ్చింది కానీ.. లేదంటే ఈ ఆరేడు నెలల్లో రెండు సినిమాలు లాగించేసేవాడేమో. జనవరి 31న అతడి చివరి సినిమా ‘అశ్వథ్థామ’ రిలీజైంది.

అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న శౌర్య.. గత రెండు మూడు నెలల్లో ఒకటికి మూడు సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా. కరోనా తర్వాత శౌర్య షూటింగ్ మొదలుపెట్టిన సినిమా ఇదే. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం.

వరుడు కావలెను.. ఇదీ శౌర్య-రీతూ కలయికలో సౌజన్య రూపొందిస్తున్న సినిమా పేరు. ఈ టైటిల్‌నే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ కూడా చేయించిందట. త్వరలోనే అధికారికంగా ఈ టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ వదులుతారట. టైటిల్‌ను బట్టి చూస్తే ఇది పెళ్లి చుట్టూ తిరిగే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. హీరోతో పాటు హీరోయిన్‌కూ సినిమాలో తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

శౌర్య ఇంతకుముందు చేసిన ‘కళ్యాణ వైభోగమే’ ఛాయలు కూడా ఇందులో ఉండొచ్చేమో. ఈ సినిమా పూర్తయ్యాక శౌర్య కోసం రెండు చిత్రాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. అలాగే సొంత బేనర్లో ‘అలా ఎలా’ దర్శకుడు అనీష్ కృష్ణతోనూ శౌర్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.