నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడిలో 28 పైగా అమాయక టూరిస్టులు చనిపోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. పర్యాటక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళను మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన వైనం ప్రతి భారతీయుడి ఆగ్రహానికి కారణమవుతోంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఇవాళ ఉదయం భారతదేశానికి వచ్చేశారు. సరిహద్దుల్లో ప్రక్షాళన చర్యలు మొదలుపెట్టిన ఆర్మీ ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చడం కొత్త పరిణామాలకు దారి తీస్తోంది. ఈ దుర్ఘటనకు స్పందనగా ఒక బాలీవుడ్ మూవీని నిషేధించాలనే పిలుపులు ఊపందుకున్నాయి.
వచ్చే నెల మే 9 హిందీ సినిమా అబిర్ గులాల్ విడుదలవుతోంది. పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ హీరోగా నటించగా వాణి కపూర్ అతని జోడిగా కనిపించనుంది. ఆర్తి ఎస్ బాగ్ది దర్శకత్వం వహించగా అమిత్ త్రివిది సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ట్రైలర్ వచ్చేసింది. ఈ ఫహద్ ఖాన్ కు ఇది ఇండియన్ డెబ్యూ కాదు. 2014 ఖూబ్సూరత్ తో తెరంగేట్రం చేశాడు. 2016 కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ లో కనిపించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లుగా పాకిస్థాన్ లో ఉంటూ ఏడెనిమిది సినిమాల్లో నటించాడు. వాటిలో ది లెజెండ్ అఫ్ మౌలా జాట్ మన దేశంలోనూ రిలీజ్ దక్కించుకుంది. ఇప్పుడీ అబీర్ గులాల్ ద్వారా ఈ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
లవ్ రొమాంటిక్ జానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలైపోయింది. పక్క దేశం ప్రోత్సహిస్తున్న చర్యలకు నిరసనగా ఇది జరగాల్సిందేనంటూ పలువురు నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అబీర్ గులాల్ వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలున్నట్టు బాలీవుడ్ రిపోర్ట్. అయినా మన దగ్గరే గంపెడు హీరోలు, వాళ్ళలో పుష్కల ప్రతిభా పాటవాలు ఉండగా అదే పనిగా పాకిస్థాన్ నటుడిని తీసుకొచ్చి యాక్ట్ చేయించడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఫహద్ ఖాన్ ఇప్పుడీ అటాక్స్ గురించి స్పందించకపోతే నిరసన మరింత తీవ్రం కావడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates