రామ్ – భాగ్యశ్రీ.. ఏంటి సంగతి?

ఒక హీరో.. ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు చిత్రాల్లో నటిస్తే వారి బంధం గురించి రూమర్స్ రావడం మామూలే. ఐతే ఒక్క సినిమాకే ఇలా వార్తల్లో నిలిచిన వాళ్లూ ఉన్నారు. ఐతే ఇప్పుడో జంట తొలిసారి కలిసి నటించిన సినిమా.. ఇంకా పూర్తి కాముందే సోషల్ మీడియా దృష్టిలో పడిపోయారు. వాళ్లే.. రామ్, భాగ్యశ్రీ బోర్సే. గత ఏడాది తెలుగులో నటించిన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’తో భాగ్యశ్రీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రిలీజ్‌కు ముందే భాగ్యశ్రీ అందచందాలు కుర్రకారుకు కిక్కెక్కించాయి.

ఆ సినిమా ప్రోమోలు వైరల్ కావడంలో భాగ్యశ్రీ పాత్ర కీలకం. తొలి చిత్రం నిరాశపరిచినప్పటికీ భాగ్యశ్రీకి అవకాశాలు వరుస కట్టాయి. అందులో ఆమె మొదట టేకప్ చేసిన సినిమా.. రామ్ హీరోగా నటిస్తున్నదే. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లాస్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా వరుసగా మాస్ మసాలా సినిమాలే చేస్తున్న రామ్.. ఈ చిత్రంతో వైవిధ్యం చూపించబోతున్నాడు. ఇందుకోసం లుక్ కూడా మార్చేశాడు. అతడి పక్కన భాగ్యశ్రీ భలేగా ఉంటుందనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఐతే షూట్ సందర్భంగా రామ్, భాగ్యశ్రీ బాగా దగ్గరైపోయారనే రూమర్లు ఇటీవల గట్టిగా వినిపిస్తున్నాయి. అందులోనూ తాజాగా హోటల్ గది నుంచి రామ్, భాగ్యశ్రీ వేర్వేరుగా ఫొటోలు షేర్ చేయగా.. అవి ఒకే గది నుంచి తీసినవని.. ఇద్దరూ కలిసే ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇలాగే అభిమానులను టీజ్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. రామ్, భాగ్యశ్రీ జంటను కూడా అదే గాటన కట్టి ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ప్రచారం రామ్, భాగ్యశ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి.