‘జటాయు’ ఎందుకు కదల్లేదు?

‘గ్రహణం’ చిత్రంతో అరంగేట్రంలోనే జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తెలుగులో గొప్ప అభిరుచి ఉన్న, తెలుగుదనంతో సినిమాలు తీసే అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయనొకరు. ఐతే కెరీర్లో ఇప్పటిదాకా చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలే చేశాడు ఇంద్రగంటి. ఆయనకు కూడా పెద్ద స్టార్లతో భారీ చిత్రాలు తీయాలనే ఆశ ఉంది. ఆయన దగ్గర ‘జటాయు’ అనే ఒక భారీ కథ ఉంది. దీన్ని రెండొందల కోట్ల బడ్జెట్లో ఒక టాప్ స్టార్‌తో తీస్తారని గతంలో ప్రచారం జరిగింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.

అన్నీ రెడీ అనుకున్నాక ఏం జరిగింది అన్నది అర్థం కాలేదు. తన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఇంద్రగంటి ‘జటాయు’ గురించి మాట్లాడారు. ‘‘సారంగపాణి కంటే ముందు ‘జటాయు’ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు. ఐతే కొన్ని రోజుల ట్రావెల్ చేసిన తర్వాత.. ఆయన నిర్మిస్తున్న ‘గేమ్ చేంజర్’ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిసి మధ్యలో ఇంకో సినిమా చేసుకుని రండి అని రాజు గారు చెప్పారు. అప్పుడే శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో ‘సారంగపాణి జాతకం’ మొదలుపెట్టాం.

‘జటాయు’ నా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా నేనే తెరకెక్కిస్తా. వేరొక దర్శకుడైతే నేను అనుకున్నట్లుగా ఆ సినిమాను తీయలేరు’’ అని ఇంద్రగంటి తెలిపారు. ఇక ‘సారంగపాణి జాతకం’లో జాతకాలు మంచివా, చెడ్డవా అనేమీ చెప్పలేదని.. నమ్మకాల్ని తాను ప్రశ్నించలేదని ఇంద్రగంటి తెలిపారు. తన జీవితంలోనూ జాతకం ప్రకారం చెప్పిన విషయాలు కొన్ని జరిగాయని, కొన్ని జరగలేదని.. జాతకాలపై నమ్మకాలనేవి ఎవరికి వాళ్లకి వ్యక్తిగత విషయాలని.. ఏ విషయమైనా పరిమితిలో ఉండాలని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశానని ఇంద్రగంటి తెలిపారు. ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.