ఆ సినిమా పోయింది.. పూజా హెగ్డే గుండె పగిలింది

బాలీవుడ్లో ప్రతి హీరోయిన్ కచ్చితంగా సినిమా చేయాలని ఆశించే హీరోల్లో హృతిక్ రోషన్ ఒకడు. అలాగే ఎవరి దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారని అడిగితే చెప్పే పేర్లలో అశుతోష్ గోవారికర్ ఒకడు. ఇలాంటి హీరో, దర్శకుడితో కలిసి తొలి సినిమాకే పని చేసే అవకాశం వస్తే అంత కంటే అదృష్టం ఉంటుందా? ఆ అదృష్టం పూజా హెగ్డేను వరించింది కొన్నేళ్ల కిందట.

అప్పటికే తమిళంలో ‘మాస్క్’.. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల్లో నటించిన పూజాకు బాలీవుడ్లో హృతిక్, అశుతోష్‌లతో కలిసి ‘మొహెంజదారో’ లాంటి మెగా మూవీతో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. దక్షిణాదిన అవకాశాలన్నీ వదులుకుని రెండేళ్ల పాటు ఈ సినిమాకే అంకితమైంది పూజా. తీరా చూస్తే ఈ సినిమా డిజాస్టర్ అయింది. పూజా హెగ్డేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఈ సినిమా ఫలితం తన గుండె పగిలేలా చేసిందంటూ ఇప్పుడు వాపోయింది పూజా. ఎవరికైనా సరే తొలి సినిమా ఎంతో కీలకమైందని. ఎన్నో ఆశలు పెట్టుకుంటామని.. ఐతే హిందీలో తన తొలి చిత్రం ‘మొహెంజదారో’ పరాజయం పాలవడం తనను తీవ్రంగా బాధించిందని పూజా వ్యాఖ్యానించింది. ఐతే ఆ బాధ నుంచి కోలుకునేలా చేసింది తెలుగు సినిమాలే అని.. ఇక్కడ తన సినిమాలు విజయవంతం కావడంతో ధైర్యంగా ముందుకు సాగానని పూజా చెప్పింది.

మొదటి సినిమా ఫెయిలవడం వల్లే హిందీలో రెండో సినిమాకు సంతకం చేసేందుకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని.. ఐతే అక్కడ తన తర్వాతి సినిమా ‘హౌస్ ఫుల్-4’ విజయవంతం కావడంతో ఇప్పుడు బాలీవుడ్ కెరీర్ మీద కూడా దృష్టిసారించానని పూజా చెప్పింది. త్వరలోనే ఆమె హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందించనున్న ‘సర్కస్’లో నటించనుంది. సల్మాన్ ఖాన్ సరసన కూడా ఆమె నటించే అవకాశాలున్నాయి. తెలుగులో ప్రస్తుతం పూజా.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.