మహేష్ ఫ్యాన్స్ ఎమోషన్లు…..బంగారు బాతు కథ

వెనకటికో పాత కథ ఉంది. కష్టాలతో విసిగి వేసారిపోయిన ఒకడికి బంగారు బాతు దొరుకుతుంది. దాని లక్షణం ఏంటంటే రోజుకో బంగారు గుడ్డు టంచనుగా ఇస్తుంది. దాన్ని అమ్ముకుని కుటుంబంతో దర్జాగా బ్రతుకుతూ రోజులు గడిపేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఓ రోజు వాడికో పిచ్చి ఆలోచన వస్తుంది. రోజుకో బంగారు గుడ్డు ఇచ్చే బాతు లోపల ఇంకెంత బంగారం ఉందో, ఒకేసారి కోసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటాడు. క్షణం ఆలస్యం చేయకుండా కత్తి తీసుకుని బాతుని చంపేసి పొట్ట లోపల చూస్తే మాంసం తప్ప ఏముండదు. దీంతో తప్పు తెలుసుకుని ఘొల్లుమంటాడు.

ఇప్పుడీ చిట్టి స్టోరీ చెప్పడానికి కారణం మహేష్ బాబు అభిమానుల ఎమోషన్లు. పాత రీ రిలీజులను వాళ్ళు ఆదరిస్తున్న వైనం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల అత్యాశకు తెరతీసి సమయం సందర్భంగా లేకుండా వరసగా థియేటర్లలో వదులుతూ వాటి విలువను తగ్గించేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారం ఒక్కడు, అంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని విడుదల చేయడం చూశాం.  వచ్చే వారం ఏప్రిల్ 26 భరత్ అనే నేను వస్తుండగా ఆపై నెల మే 30 ఖలేజా, మే 31 అతిథిలను వరుసగా ప్లాన్ చేశారు. ఎంత కృష్ణ పుట్టినరోజు అయితే మరీ ఒకేసారి రెండు అంటే సెలబ్రేషన్స్ పరంగా ఫ్యాన్స్ మీద చాలా భారం పడుతుంది. అతిథి ఎప్పుడో ప్లాన్ చేసింది కానీ ఖలేజాని హఠాత్తుగా తీసుకొచ్చారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అభిమానుల ఎమోషన్లు చాలా సున్నితమైనవి. వాటిని ఖరీదుతో కొనలేం. కానీ వాళ్ళ స్థోమతకు మించి ఖర్చు పెట్టించడం సబబు కాదనేది వాస్తవం. ఏదో ఏడాదికి ఒకటి రెండు అంటే సరే. చేసిన ఇరవై ఎనిమిది సినిమాల్లో ఆరేడు ఒకే సంవత్సరంలో విడుదల చేస్తే వాటి వేల్యూ ఏమవుతుంది. ఫ్యాన్స్ పర్సులు చిల్లులు పడటం తప్ప జరిగేది ఏముంది. చూడకుండా ఉండలేని వాళ్ళ బలహీనతను ఇంతగా క్యాష్ చేసుకోవడానికి ఎందుకు ఆరాటపడాలనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం దొరికే లోపే టక్కరి దొంగ, నిజం, రాజకుమారుడు అంటూ మరికొన్ని రెడీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.