అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్. ఐతే చాలా ఏళ్ల నుంచి ఆయనకు సరైన విజయాలు లేవు. దీంతో దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. దీనికి తోడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల విషయంలో అతడికి తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఈ మధ్య తాను బాలీవుడ్కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఐతే తన గురించి బాలీవుడ్ మీడియాలో నెగెటివ్ వార్తలు రావడం.. సోషల్ మీడియాలోనూ నెగెటివ్ ప్రచారం జరగడం మామూలే. ఇలాంటి ప్రచారం మీదే ఇప్పుడు అనురాగ్ ఘాటుగా స్పందించాడు.
తాను సినిమాల్లేకుండా ఖాళీ అయిపోయానని ఒక వర్గం ప్రచారం చేస్తోందంటూ అతను మండిపడ్డాడు. తాను షారుఖ్ కంటే బిజీ అని.. రోజుకు మూడు సినిమాలు రిజెక్ట్ చేసే స్థాయిలో ఉన్నానని అనురాగ్ ట్వీట్ చేయడం విశేషం. నేను సినిమాలు వదిలేశాను అనుకున్న వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ చెబుతున్నా. నేను ఇక్కడే ఉన్నాను. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను (అలా కచ్చితంగా ఉండాలి, కానీ అతనంత డబ్బు మాత్రం సంపాదించను).
2028 వరకు నా డేట్స్ ఖాళీ లేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది మొదట్లో రెండు విడుదల కావచ్చు. నాకు సుదీర్ఘమైన ఐఎండీబీ ఉంది, రోజుకు మూడు ప్రాజెక్ట్లకు నో చెప్పేంత బిజీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ పని మీరు చూసుకోండి” అంటూ కొన్ని బూతులు కూడా జోడించి తన విమర్శకులకు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. కొన్నేళ్లుగా అనురాగ్ నటుడిగానే ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళంలో మహారాజ, లియో సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా మహారాజలో అనురాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. డకాయిట్ మూవీతో తెలుగు సినిమా డెబ్యూ చేయనున్నాడు.