డ్రీమ్ ప్రాజెక్టుపై దర్శకుడి క్లారిటీ

‘గ్రహణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడిగా ఆయనకు పేరుంది. కాకపోతే కెరీర్లో చాలా వరకు ఇంద్రగంటి చిన్న సినిమాలే చేశారు. ‘వి’ చిత్రంతో ఆయన రేంజ్ పెరుగుతుందని అనిపించింది. కానీ ఆ సినిమా నిరాశపరచడంతో మళ్లీ ముందులాగే చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. వచ్చే వారం ఆయన కొత్త చిత్రం ‘సారంగపాణి జాతకం’ రాబోతోంది. దీని తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదు.

ఐతే ‘జటాయు’ పేరుతో ఇంద్రగంటి ఓ భారీ చిత్రం చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా చేయడానికి గతంలో ప్రయత్నాలు చేశారు ఇంద్రగంటి. తాజాగా ‘జటాయు’ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. ‘జటాయు’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఆ సినిమాను భారీ స్థాయిలో తీయాలనే ఆలోచన ఉందని.. త్వరలోనే దాని గురించి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు ఇంద్రగంటి.

ఇక ఇటీవల ఓ డ్యాన్స్ షోలో ‘మాయా బజార్’లోని ‘అహనా పెళ్ళంట’ పాటకు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసిన అమ్మాయిని ఇంద్రగంటి అభినందించడం వివాదాస్పదమైంది. ఇలాంటి డ్యాన్సుల విషయంలో మందలించాల్సింది పోయి అభినందనేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఇంద్రగంటి స్పందించారు. ఆ షోల్లో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే అవకాశం ఉండదన్నారు. కొన్ని పరిమితుల మధ్య మాట్లాడాల్సి ఉంటుందని.. అందుకే ఆ డ్యాన్స్ గురించి విమర్శ చేయలేకపోయానని ఆయనన్నారు.