కోలీవుడ్లో మ‌రో ఎగ్జైటింగ్ కాంబినేష‌న్‌

లాక్ డౌన్ టైంలో ఖాళీగా ఉన్న ఫిలిం మేక‌ర్లు, ఆర్టిస్టుల మ‌ధ్య జోరుగా క‌థా చ‌ర్చ‌లు న‌డిచాయి. ఈ క్ర‌మంలోనే భ‌లే భ‌లే కొత్త కాంబినేష‌న్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇటు తెలుగులో, అటు త‌మిళంలో కొత్త సినిమాలు చాలానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మ‌రో కొత్త క‌ల‌యిక తెర‌పైకి వ‌చ్చింది.

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ న‌రేన్ ఓ సినిమా రూపొందించ‌బోతున్నాడు. నాలుగేళ్ల కింద‌ట వ‌చ్చిన థ్రిల్ల‌ర్ మూవీ ధ్రువంగ‌ల్ ప‌దినారు సినిమాతో సెన్సేష‌న‌ల్ ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్. పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల‌ను కూడా షాక్‌కు గురి చేసిందా చిత్రం. హాలీవుడ్ థ్రిల్ల‌ర్ల‌కు దీటుగా ఆ చిత్రాన్ని ఉత్కంఠ‌భ‌రితంగా మ‌లిచాడ‌త‌ను. ఆ సినిమా తీసేట‌ప్ప‌టికి కార్తీక్ వ‌య‌సు 21 ఏళ్లు మాత్ర‌మే.

ధ్రువంగ‌ల్ ప‌దినారుకు కొన‌సాగింపుగా తీసిన న‌ర‌కాసుర‌న్ వేరే కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌కు నోచుకోలేదు. త‌ర్వాత అరుణ్ విజ‌య్ హీరోగా మాఫియా సినిమాతో హిట్టు కొట్టాడు కార్తీక్. మాఫియా సిరీస్‌లో ఇంకో రెండు సినిమాలు కూడా తీయాల్సి ఉంది. ఐతే ఈలోపు అత‌ను ధ‌నుష్ లాంటి పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేయ‌బోతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త‌క్కువ సినిమాల‌తోనే స్టార్ హీరోయిన్‌గా మారి, విజ‌య్ స‌ర‌స‌న మాస్ట‌ర్ సినిమాలో కూడా న‌టించిన మాళ‌విక మోహ‌న‌న్ ఇందులో ధ‌నుష్‌తో జోడీ క‌ట్ట‌నుంది.

పేట సినిమాలో ర‌జినీకాంత్‌కు చెల్లెలిగా న‌టించిన ఆమె.. ఇప్పుడు ఆయ‌న అల్లుడికి జోడీగా న‌టించ‌డం విశేష‌మే. ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు. ధ‌నుష్ మ‌రో యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన‌ జ‌గ‌మే తంత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇది తెలుగులోనూ రానుంది. కార్తీక్‌తో ధ‌నుష్ చేయ‌నున్న సినిమా కూడా తెలుగులో రావ‌డం లాంఛ‌న‌మే.