టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకుంది. కేరళ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఆఫ్రికాలో ప్లాన్ చేసుకున్న లాంగ్ షెడ్యూల్ కు అనుమతులు, వీసాలు కుదరగానే ప్రయాణం తేదీని నిర్ణయించబోతున్నారు. ఇప్పటిదాకా ఫిక్స్ అయిన క్యాస్టింగ్ లో పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పేర్లు మాత్రమే బయటికి రాగా ఇంకెవరెవరు ఉన్నారనేది గుట్టుగానే ఉంది. ఇదిలా ఉండగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ ప్యాన్ వరల్డ్ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో రాజమౌళి లేరట. కాస్త నిడివి ఎక్కువైనా సరే యానిమల్, పుష్ప తరహాలో ఓ మూడున్నర గంటలు సెట్ చేసినా పర్వాలేదు కానీ సీక్వెల్ కోసం ప్రయాస అవసరం లేదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అసలీ సినిమా మొదలుకాక ముందే పార్ట్ 2 గట్రాలు వద్దనుకున్నారని సమాచారం. అయితే అధికారికంగా ఏదీ ఇంకా బయటికి చెప్పలేదు కాబట్టి నిర్ధారణకు రాలేం కానీ అభిమానులు, సినీ ప్రియులు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ కాలేదు. ఓ రెండు నిమిషాల వీడియోని సిద్ధం చేసి ప్రాజెక్టుని ప్రకటించే ప్రణాళిక రెడీ అవుతోందట. అది ఎప్పుడనేది జక్కన్న చెబితే తప్ప కనీసం లీక్ అవ్వడం కూడా కష్టమే. మహేష్ బాబు విదేశీ పర్యటనలు దూరం పెట్టి మరీ రాజమౌళి కోసం అంకితమైపోయాడు. 2027 విడుదల చేయాలనేది నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ లక్ష్యం. చూస్తుంటే సాధ్యమయ్యేలానే ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ కి మైథలాజి జోడించి విజయేంద్రప్రసాద్ చాలా పవర్ ఫుల్ స్టోరీ ఇచ్చారట. వెయ్యి కోట్ల విజువల్ గ్రాండియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.