రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై వార్నర్ రియాక్షనేంటి?

మొన్న ‘రాబిన్ హుడ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ క్యామియో చేసిన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తన స్పీచ్‌లో రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావిస్తూ.. కొంచెం అదుపు తప్పి మాట్లాడారు. ‘‘ఈ డేవిడ్ వార్నరు.. నిన్ను క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్స్ వేస్తున్నాడు. దొంగ ముండాకొడుకు. వీడు మామాలోడు కాదండీ వీడు. ఏయ్.. రేయ్ వార్నరూ..’’ అంటూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే మాట్లాడినట్లు కనిపించినప్పటికీ.. దొంగ ముండా కొడుకు.. వీడు.. రేయ్ వార్నర్.. లాంటి పదాలు వాడడం విమర్శలకు దారి తీసింది.

వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల వివాదం గురించి స్పందించాడు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల గురించి వార్నర్‌తో మాట్లాడినట్లు అతను వెల్లడించాడు. ‘‘ప్రి రిలీజ్ ఈవెంట్ అయ్యాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మాటల వెనుక ఉద్దేశమేంటో వార్నర్‌కు వివరించా. ఆయన చాలా సరదాగా తీసుకున్నాడు. క్రికెట్లో తనకు స్లెడ్జింగ్ అలవాటే అని.. ఇది నటుల మధ్య స్లెడ్జింగ్ అనుకుంటానని చెప్పాడు.

రాజేంద్ర ప్రసాద్ గారు తన చుట్టూ ఉన్న వాళ్లను చిన్న పిల్లల్లా చూస్తుంటారు. అలా డేవిడ్ వార్నర్ గురించి సరదాగా చెప్పిన మాటలే అవి. అంతకుమించి ఇందులో వివాదం ఏమీ లేదు’’ అని వెంకీ వివరించాడు. ఇక ఈ చిత్రంలో వార్నర్‌ను నటింపజేయడం గురించి వెంకీ చెబుతూ.. ‘‘ఇంటర్నేషనల్ లెవెల్ల గుర్తింపు ఉన్న ఓ స్టార్ చేయాల్సిన అతిథి పాత్ర ఒకటి రాశాను. ఆ పాత్రలో ఎవరైతే బాగుంటుందని అడిగితే వార్నర్ పేరు చెప్పాను. కానీ ఆయన నటిస్తారని అనుకోలేదు. నిర్మాతలు సీరియస్‌గా ట్రై చేసి ఢిల్లీలో ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కథ, పాత్ర నచ్చి ఆయన వెంటనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు’’ అని అన్నాడు.