స్టార్ వారసులు ఫ్యామిలీ లెగసిని కొనసాగించే క్రమంలో తాతలు, తండ్రుల బ్లాక్ బస్టర్స్ రీమేక్ చేయడం అభిమానులు కోరుకుంటారు. కానీ అదంత ఈజీ కాదు. అందుకే రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, నాగచైతన్య వీళ్ళెవరూ వాటి జోలికి వెళ్లకుండా కొత్త కథలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. సీనియర్లలో నాగార్జున ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ దేవదాస్ ని స్ఫూర్తిగా తీసుకుని మజ్ను ట్రై చేశారు కానీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఏవైనా తాత సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేయాలనే కాంక్ష ఫ్యాన్స్ లో ఎప్పటి నుంచో ఉంది. యమదొంగతో కొంచెం ట్రై చేసినా పూర్తిగా నెరవేరలేదు.
తారక్ సైతం వాటి పట్ల సానుకూలంగానే ఉన్నాడు కానీ అలాని తొందరపడే ఉద్దేశం లేదు. తాత నందమూరి తారకరామారావు తిరుగులేని ముద్రవేసిన పౌరాణిక, ఇతిహాస గాథలు చేయాలని తనకూ ఉందని కాకపోతే సరైన దర్శకుడు, అవకాశం దొరికితే తప్ప చేయనని ఇటీవలే చెప్పినట్టు వచ్చిన వార్త సినీ ప్రియులను ఆలోచనలో పడేసింది. కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి టైంలో రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానవీరశూరకర్ణ లాంటి గ్రాండియర్ ని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలనే కోరికను వెలిబుచ్చాడు. ఆ ముచ్చట యమదొంగతో కొంత తీర్చుకున్నా అది రీమేక్ కిందకు రాదు కాబట్టి సరిపోలేదు.
నిజంగా తారక్ కనక అలా ఎంచుకోవాల్సి వస్తే నటనకు ఛాలెంజ్ విసిరే సర్దార్ పాపారాయుడు, శ్రీ కృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, జస్టిస్ చౌదరి, బందిపోటు, అగ్గిపిడుగు, గుండమ్మ కథ, నర్తనశాల లాంటివి ట్రై చేయొచ్చు. విస్తృతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఎంపిక జాగ్రత్తగా ఉండాలి. పాండురంగ మహత్యంని పాండురంగడుగా, లవకుశని శ్రీరామరాజ్యంగా రీమేక్ చేసుకున్న బాలకృష్ణ ప్రశంసలు అందుకున్నారు కానీ గొప్ప ఫలితాలు దక్కించుకోలేదు. బాబాయ్ లాగా జరగకూడదు అనుకుంటే అబ్బాయ్ సెలక్షన్ కేర్ ఫుల్ గా ఉండాలి.