‘హత్య’ సినిమాతో హర్టయిన ‘వివేకా’ నిందితుడు

2019 ఎన్నికల ముంగిట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందు ఈ హత్యకు కారకుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని వైకాపా ప్రచారం చేసింది కానీ.. చివరికి ఈ కేసు వైఎస్ జగన్, ఆయన సోదరుడు వైఎస్ అవినాష్‌ల మెడకే చుట్టుకుంది. 2019 ఎన్నికల్లో విజయానికి తోడ్పడ్డ ఈ కేసే.. తర్వాత ప్రతికూలంగా మారి, 2024 ఎన్నికల్లో ఓటమికి కొంత మేర కారణమైంది. గత ఏడాది వివేకా హత్య ఉదంతం మీద తీసిన ‘వివేకం’ సినిమా వైసీపీకి ఎంతగా డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ హత్య చేయించింది అవినాష్, సపోర్ట్ చేసింది జగన్ అనిపించేలా ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు సంచలనం రేపాయి. నేరుగా ఆన్ల లైన్లో ఫ్రీగా రిలీజ్ చేసి వైసీపీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు దాని మేకర్స్. ఐతే వివేకా హత్య ఆధారంగా ఇటీవల ‘హత్య’ అనే మరో చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ అనుకూల వ్యక్తులు రూపొందించారు. ‘వివేకం’కు దీన్ని కౌంటర్ మూవీగా చెప్పొచ్చు. ఈ కేసులో జగన్, అవినాష్ ప్రమేయం ఏమీ లేదని.. హత్యకు కారణం ఆస్తి తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే అన్నట్లుగా ఇందులో చూపించారు. ఐతే ‘వివేకం’లా ఈ చిత్రం పాపులర్ కాలేకపోయింది.

కాగా ఈ సినిమా విషయంలో వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ హర్టయ్యారు. తనను, తన తల్లిని కించపరిచేలా చూపించారంటూ ఈ సినిమాలో చిత్రీకరించారంటూ అతను ‘హత్య’ మేకర్స్ మీద కేసు పెట్టాడు. కడప ఎస్పీతో పాటు పులివెందుల డీఎస్పీని కలిసి అతను ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన తల్లి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని.. ఇలా చేస్తున్న వారి బండారం బయటపెడతానని సునీల్ యాదవ్ అన్నాడు. తాను 36 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని.. ఆ సమయంలో తన తండ్రిని కూడా కోల్పోయానని సునీల్ యాదవ్ చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి ‘హత్య’ సినిమా దర్శక నిర్మాతలతో పాటు ఈ సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైఎస్ అవినాష్ యూత్ ప్రతినిధులను అతను నిందితులుగా చేర్చాడు.